వీర్నపల్లి, ఫిబ్రవరి 8: ఇటీవల గర్జనపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, వీర్నపల్లి వైస్ ఎంపీపీ ఈసంపల్లి హేమ భర్త దేవేందర్ గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ గత నెల 30న బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా దేవేందర్ ఇద్దరు కూతుళ్ల పేరిట చెరో రూ.2.50 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 7న తన సొంత డబ్బులు రూ.5 లక్షలు జమ చేశారు. సదరు బ్యాంకు డిపాజిట్ పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగ య్య అందించనున్నారని మండలాధ్యక్షుడు గుజ్జల రాజిరెడ్డి తెలిపారు. కాగా, మంత్రి కేటీఆర్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.