హైదరాబాద్, నమస్తే తెలంగాణ;రైతులకు రైతు బీమా తరహాలోనే నేతన్నలకు ‘నేతన్న బీమా’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. ఇందులో భాగంగా చేనేత, పవర్లూమ్, యాన్సిలరీ వర్కర్స్ మరణిస్తే ఎల్ఐసీ ద్వారా రూ.5 లక్షల బీమా అందించనున్నది. రాష్ట్రంలోని 55,072 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ చేనేత, వస్త్ర శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఈ పథకానికి రూ.29.88 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
చేనేతకు ప్రభుత్వం అండగా
నేతన్నకు చేయూత, చేనేత మిత్ర పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నది కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర సర్కారు. వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమయ్యే యూనిఫామ్స్, బతుకమ్మ చీరలు తదితర వస్ర్తాలను చేనేత, పవర్లూమ్ కార్మికులతో తయారు చేయించి చేతి నిండా పని కల్పిస్తున్నది.
కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్నగర్ తదితర జిల్లాల్లో పెద్ద సంఖ్యలో నేత కార్మికులు ఈ రంగాన్ని నమ్ముకొన్నారు.వారందరికీ బీమాతో లబ్ధి చేకూరుతుంది.