హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ)/బండ్లగూడ, సెప్టెంబర్ 28: హైదరాబాద్ నగర శివారు పరిధిలో బండ్లగూడ సన్ సిటీలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో గణేశ్ లడ్డూ వేలంలో దేశంలోనే రికార్డు స్థాయి ధర పలికింది. రూ.1.26 కోట్లకు ఆ కాలనీకి చెందిన బాల్గణేశ్ గ్రూప్ లడ్డూను కైవసం చేసుకొన్నది. ప్రతిష్ఠాత్మకమైన బాలాపూర్ లడ్డూ ధర నిరుటి రికార్డును బ్రేక్ చేసింది. ఈసారి ఏకంగా రూ.27 లక్షలకు తుర్కయంజాల్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దాసరి దయానంద్రెడ్డి కైవసం చేసుకొన్నారు. మాదాపూర్ మైహోం భూజ్ గేటెడ్ కమ్యూనిటీలో నిర్వహించిన వేలంలో గణేశ్ లడ్డూను చిరంజీవిగౌడ్ రూ.25.05 లక్షలకు సొంతం చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల గణేశ్ లడ్డూలకు లక్షల్లో ధరలు పలుకడం విశేషం. నవరాత్రుల అనంతరం గురువారం రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ శోభాయాత్రకు ముందు నిర్వాహకులు లడ్డూల వేలం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎప్పుడూ వేలంలో లక్షల్లో పలికే గణేశ్ లడ్డూకు ఈ ఏడు రూ.కోటి దాడటంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. 2016లో కేవలం రూ.25 వేలు పలికిన కీర్తి రిచ్మండ్ విల్లా గణేశ్ లడ్డూకు మరుసటి ఏడాది రూ.1.30 లక్షలు, 2018లో రూ.2.30 లక్షల చొప్పున పలికింది. ఆ తర్వాత నుంచి లక్షలాది రూపాయల ధర పలికిన ఈ విల్లా లడ్డూకు ఈసారి అనుకోని రీతిలో రికార్డు ధర పలికింది. నిరుడు రూ.60 లక్షల ధర పలుకగా, ఈ సారి వేలంలో దానికి రెట్టింపు ధర రావడం విశేషం.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో మొత్తం 150 మంది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రతిఏటా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు చేస్తుంటారు. లడ్డూ వేలం సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఓ సభ్యుడి ఆలోచనను అందరూ సమర్థించారు. దానికోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. దాంతో ఆ కుటుంబాలు ఒక్కో గ్రూపులో 40 కుటుంబాలు ఉండేలా నాలుగు గ్రూపులుగా ఏర్పాటయ్యాయి. తమ గ్రూప్లకు చోటా భీమ్, బాల్గణేశ్, శక్తిమాన్, బాహుబలి అని పేర్లు పెట్టుకున్నారు. ప్రతి ఏటా ఈ నాలుగు గ్రూపులు గణేశ్ లడ్డూ వేలంలో పాల్గొంటాయి.
కీర్తి రిచ్మండ్ విల్లా సభ్యులందరూ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటారు. వేలంలో వచ్చిన డబ్బుతో సామాజిక సేవలకు ఖర్చు చేస్తుంటారు. మొదటగా స్వచ్ఛంద సంస్థలను గుర్తించి వస్తు, ఇతర సామగ్రిని అందజేస్తారు. నిజమైన పేదలను గుర్తించి వారికి అవసరమైన సేవలు అందిస్తారు. అనాథలైన పిల్లల భవిష్యత్తుకు సాయం చేస్తుంటారు. బాధల్లో ఉన్నవారందరూ బాగుపడాలన్నదే తమ ఉద్దేశమని విల్లా సభ్యులు పేర్కొనడం విశేషం. రిచ్మండ్ విల్లాలో తమ కుటుంబం నివాసం ఉంటుండటం గర్వంగా ఉన్నదని కైలా జయప్రకాశ్రెడ్డి చెప్పారు. తమ కాలనీని ఆదర్శంగా తీసుకొని ఇతరులు సామాజిక సేవలో తరలించాలని విల్లావాసులు కోరుకుంటున్నారు.