హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో తెలంగాణ దూసుకెళ్తున్నది. సోలార్ ఎనర్జీలో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి, వాడకంలోనూ తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ (రెడో) కృషిచేస్తున్నది. రెడ్కో ద్వారా 4,511 మెగావాట్ల సోలార్, 128 మెగావాట్ల విండ్ ఎనర్జీని తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించారు. తెలంగాణ రెడ్కోకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. రెడ్కో సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడంతోపాటు విద్యుత్తు ఆదాచేసే పరికరాలు, బల్బుల వాడకాన్ని కూడా ప్రోత్సహించారు.
పునరుత్పాదక ఇంధన శక్తి కార్యక్రమాలు
రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ వెహికల్, ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్ పాలసీని తీసుకొచ్చింది. పునరుత్పాదక ఇంధన కార్యక్రమం కింద తెలంగాణ 4,511.77 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నది. విద్యుత్తును ఆదాచేసే సమర్థ ఉపకరణాల పంపిణీ, డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ యాక్టివిటీ కింద ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నది. వాణిజ్య భవనాల కోసం ఇంధన పరిరక్షణ బిల్డింగ్ కోడ్ను అమలు చేస్తున్నది. విద్యుత్తు సంరక్షణ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో 1,005 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అయింది. దాని విలువ 3.30 లక్షల మెట్రిక్ టన్నుల చమురు (విద్యుత్, ఉష్ణ శక్తి రెండింటినీ కలిగి ఉంటుంది) శక్తికి సమానం. అన్ని గ్రామపంచాయతీల్లో ప్రస్తుతం ఎకువ విద్యుత్తు అవసరమయ్యే లైట్ల స్థానంలో ఎల్ఈడీ వీధిలైట్లను వాడుతున్నారు. తద్వారా వార్షిక ఇంధన పొదుపులో 50 శాతం సాధించవచ్చని రెడ్కో అంచనా వేసింది.
రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి చార్జింగ్ పాయింట్లు
విద్యుత్తు వాహనాలను ప్రోత్సహించేందుకు రెడ్కో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి చార్జింగ్ పాయింట్లను పీపీపీ మాడల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం 156 ఎలక్రికల్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. మరో వంద స్టేషన్ల పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 32 వేల ఎలక్ట్రికల్ వాహనాలున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి రెండు లక్షల ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు, మొదటి 5,000 యూనిట్ల నాలుగు చక్రాల వాహనాలకు రోడ్డు పన్నుతోపాటు రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా రద్దు చేయడంతో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెరిగింది. ఈ రంగంలో దాదాపు రూ.30,000 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా 1.2 లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నట్టు రెడ్కో తెలిపింది.