KTR | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అస్థిత్వాన్ని పెంచడంతో ఆస్తులు కూడా సృష్టించామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. ప్రభుత్వం అప్పులు చేసినా ఆ నిధులను భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా పెట్టిందని వివరించారు. 60 ఏండ్లలో అప్పటి ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధికి రూ. 4,98,053 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.13,72,930 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ఆదివారం తెలంగాణభవన్లో స్వేదపత్రం విడుదల చేసిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం అప్పులు చేసిందంటూ ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణలో మౌలికవసతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నదని, సాగు, తాగునీరు లేదని, కరెంటు సమస్యలు, కరువులు, వలసలు ఇలా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని గుర్తుచేశారు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ప్రేమ్అమన్ రూపొందించిన డాక్యుమెంటరీ అనాటి పరిస్థితులకు ఒక తార్కాణమని ఉదహరించారు. తెలంగాణ ఆదాయం నుంచి వచ్చే నిధులను ఇక్కడి అభివృద్ధికే వెచ్చించాలనే ఒప్పందాలను కూడా ఉల్లంఘించి ఆంధ్రాకు మళ్లించిన విషయాన్ని లలిత్కుమార్, వశిష్టభార్గవ కమిషన్లే తేల్చిచెప్పాయని పేర్కొన్నారు. అలాంటి సవాళ్ల నడుమ తెలంగాణ పాలనాపగ్గాలను స్వీకరించిన కేసీఆర్.. ఒక్కో రంగంలోని సమస్యలను పరిష్కరించుకుంటూ అనతికాలంలోనే అద్భుతమైన ప్రగతిని నమోదు చేశారని వివరించారు. తాగు, సాగునీరు, విద్యుత్, రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, లక్షల కోట్లను భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా పెట్టారని విశదీకరించారు. వాటిని అప్పుగా ప్రచారం చేయడం తగదని పేర్కొన్నారు.
వెలుగులను ఎలా ఖరీదు కడతారు?
బీఆర్ఎస్ ప్రభుత్వం ఆస్తులు పెంచింది అని చెప్పడానికి ఒక్క విద్యుత్తు రంగమే నిదర్శనమని కేటీఆర్ ఉదహరించారు. తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్రంలో కరెంటు పరిస్థితి అందరికీ తెలుసని, లోటు విద్యుత్తు ఉన్నదని వెల్లడించారు. అర్ధరాత్రి కరెంటుతో అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, వ్యవసాయమే కుంటుపడిపోయిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తాము కరెంటును ప్రాధాన్యరంగాల్లో ఒకటిగా ఎంచుకున్నామని వివరించారు. విద్యుత్తు రంగంలో రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు రూ.1,37,517 కోట్లు పెట్టుబడిగా పెట్టి, రూ.6,87,585 కోట్ల విలువైన ఆస్తులు సృష్టించామని వివరించారు. కొత్తగా విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, సబ్స్టేషన్లు, హైటెన్షన్ లైన్ల నిర్మాణం చేపట్టామని, మొత్తంగా స్థాపిత విద్యుత్తు సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,464 మెగావాట్లకు పెంచామని, రాబోయే రోజుల్లో అది 26 వేల మెగావాట్లకు పెరగనున్నదని వెల్లడించారు. 2014లో సగటున 6 గంటల కంటే తక్కువ కరెంటు ఇవ్వగా, నేడు 19.20 గంటలకు పెరిగిందని, ఈ విషయాలను ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలోనే పొందుపరిచారని తెలిపారు. నాణ్యమైన, 24 గంటల విద్యుత్తు సరఫరాతో వ్యవసాయరంగం ఎంతో అభివృద్ధి చెందిందని, అందుకు 19 లక్షల నుంచి 28 లక్షలకు పెరిగిన మోటర్ కనెక్షన్లే నిదర్శనమని చెప్పారు.
మెడికల్ కాలేజీలు పెంచడం ద్వారా నిరుపేద విద్యార్థులు కూడా అతితక్కువ ఫీజులతో సీట్లను పొంది ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారని, వారి కుటుంబాల జీవితాలే మారనున్నాయని, దానిని ఎలా లెక్కకడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో హరిత, గులాబీ, శ్వేత, నీలి, పసుపు ఇలా ఐదు విప్లవాలను సృష్టించామని వివరించారు. పదేండ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఫలితాలకు, అమలు చేస్తున్న పథకాలకు అనేక కేంద్ర సంస్థలు అవార్డులు, ప్రశంసలు కురిపించాయని, వాటిని ఎలా కొలుస్తారని ప్రశ్నించారు. ఇకనైనా అప్పుల ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం చేపట్టిన అనేక నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయని, వాటిని పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
తాగునీటి రంగంలో తొమ్మిదేండ్ల ప్రగతి ప్రస్థానం
వ్యవసాయరంగంలో వెచ్చించిన మొత్తాలు