హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది టెట్ను 48,582 పంతుళ్లు రాయనున్నారు. పేపర్ -1కు 9,756, పేపర్ -2కు 38,826 (గణితం 22,369, సోషల్స్టడీస్ 16,457) మంది టీచర్లు దరఖాస్తు చేశారు. శనివారం టెట్ దరఖాస్తు గడువు ముగియగా, మొత్తం 48,582 దరఖాస్తులొచ్చాయి. వీరంతా టెట్లో అర్హత సాధించేందుకు నిరుద్యోగ అభ్యర్థులతో సమానంగా కుస్తీపట్టనున్నారు.
నిజంగా పరీక్షే..
టెట్ సిలబస్, మారిన ప్రశ్నపత్రాల సరళి నేపథ్యంలో నిజంగా పంతుళ్లకు పరీక్షే అని చెప్పవచ్చు. ఇప్పుడు టెట్ రాస్తున్నవారంతా 8-10 పదేండ్ల క్రితం నియమితులయ్యారు. మరికొంత మంది 25 ఏండ్లకు పైగా సర్వీసును పూర్తి చేసుకొన్నవారున్నారు. ఇటీవలి టెట్ ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంది. నిరుడు పేపర్-1లో 36శాతం, పేపర్-2లో కేవలం 15శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదైంది. పేపర్ -2లో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఉత్తీర్ణత 49 శాతం మాత్రమే. గతంలో 19, 25, 28శాతం చొప్పున ఉత్తీర్ణత వచ్చింది. టెట్ పాసైతేనే పదోన్నతి లభించే అవకాశం ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీచర్లు టెట్ కొరకు కష్టపడుతున్నారు. ఎస్ఏ జీవశాస్త్రం ఉపాధ్యాయులు గణితంలో 60 మార్కులకు టెట్ పరీక్ష రాయాల్సి ఉన్నది. అదే సైన్స్ కంటెంట్లో ఫిజిక్స్, రసాయన శాస్ర్తాలుండగా, వీటిలో 24 మార్కులే ఉన్నాయి. సాంఘికశాస్త్రం పేపర్ రాసే వారు ఇంగ్లిష్ 30 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉన్నది.