ప్రభుత్వం వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదన్నట్టు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లూ మాట్లాడుతున్నరు. వారికి నిమ్స్ ఎంత బలోపేతమైందో తెలుసు. లేకపోతే ఇతర రాష్ర్టాల వైద్య విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఎందుకు చేరుతరు. కొందరు కండ్లు ఉండీ చూడలేరు. సగం జ్ఞానంతో కామెంట్లు చేస్తున్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్న. ప్రభుత్వానికి కమిట్మెంట్ లేకుంటే ఇంత ఖరీదైన రోబో ఎందుకు తెస్తుంది?
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ హాస్పిటల్స్తో నిమ్స్ దవాఖాన పోటీ పడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కరోనా, అవయవాల మార్పిడి.. ఇలా ఏ రంగం తీసుకొన్నా నిమ్స్ దూసుకుపోతున్నదని చెప్పారు. సోమవారం నిమ్స్ దవాఖానలో రూ.48 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన రోబోటిక్ సర్జరీ, ఇతర విభాగాల యంత్రాలను ఆయన ప్రారంభించారు. యంత్రాల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్జరీ గౌను ధరించి రోబో యంత్రంపై కూర్చొని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. డావెన్సీ ఎక్స్ఐ రోబోను రూ.32 కోట్లతో కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఈ ఫోర్త్ జనరేషన్ రోబో దేశంలోని ప్రభుత్వ రంగ దవాఖానల్లో తొలిసారిగా మన నిమ్స్లోనే రావటం సంతోషకరమని వెల్లడించారు. రూ.10 కోట్లతో 150 డయాలసిస్ యంత్రాలతో దేశంలోనే అతిపెద్ద డయాలసిస్ సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేసినట్టు వివరించారు. రూ.13 కోట్లతో హైఎండ్ డీఎస్ఏ, రూ.9 కోట్లతో ఎమ్మారై, రూ.7 కోట్లతో నెక్ట్స్ జెన్ జీనోమ్ సీక్వెన్సింగ్ మెషిన్, రూ.6 కోట్లతో న్యూరో నావిగేషన్ మెషిన్, రూ.5 కోట్లతో హెచ్డీఆర్ బ్రాకీథెరపీ, రూ.5 కోట్లతో అనస్థీషియా వర్స్టేషన్లు, రూ.5 కోట్లతో మొబైల్ డీఎస్ఏ, రూ.4 కోట్లతో ఫ్రాక్చర్ ఫిక్సషన్ సె ట్లు, రూ.4 కోట్లతో పాథాలజీ సానర్, రూ.3 కోట్లతో ఇంట్రా ఆపరేటివ్ మైక్రోసోప్, రూ.3 కోట్లతో బ్రాంకో సోప్లు.. ఇలా రూ.154 కోట్లతో ఆయా విభాగాలకు అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు చేసినట్టు తెలిపారు.
డాక్టర్లు మరింత కష్టపడతాంటున్నరు
అత్యాధునిక వైద్య పరికరాలు మరింత కష్టపడి చేసేందుకు ఊతం ఇచ్చాయని నిమ్స్ డైరెక్టర్, వైద్యులు తనతో అన్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. ‘ఇంత మంచి వైద్య పరికరా లు వస్తాయని ఊహించలేదని వైద్యులు అంటున్నరు. ప్రభుత్వం తమను ఇంత బలోపేతం చేస్తుందని అనుకోలేదని చెప్పారు. గొప్ప సహకారం అందించిందని, ఇంకా కష్టపడి పనిచేస్తామని హామీ ఇస్తున్నారు. డావెన్సీ రోబోను సమకూర్చుకొన్నందుకు వీరికి (వైద్య సిబ్బందికి) శుభాకాంక్షలు’ అని వెల్లడించారు. వైద్య రంగంలో తెలంగాణ దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందని, సీఎం కేసీఆర్ రూ.154 కోట్లతో కొత్త పరికరాల కొనుగోలుకు గ్రాంట్ అందించారని తెలిపారు. మిగిలిన వైద్య పరికరాలను త్వరలోనే తీసుకొంటామని పేర్కొన్నారు.
రోబో వల్ల త్వరగా కోలుకుంటారు
గతంలో శస్త్రచికిత్సలు చేయాలంటే బట్టల మీద రక్తపు మరకలు పడేవని వైద్యులు తనతో చెప్పారని, ఇప్పుడు ఈ రోబో వల్ల కడుపు చీరాల్సిన అవసరం ఉండదని, రక్తస్రావం ఉం డదని, కోత లేకుండా చిన్నపాటి రంధ్రాలతో సర్జరీ చేయవచ్చని, ఇన్ఫెక్షన్ కూడా పెద్దగా ఉండదని హరీశ్రావు తెలిపారు. రోగి దవాఖానలో ఉండాల్సిన సమయం కూడా తగ్గుతుందని, వారికి ఖర్చు తగ్గుతుందని వెల్లడించారు. వైద్యులు ఎక్కువ సర్జరీలు చేయగలుగుతారని చెప్పారు. ఇంత మందికి వైద్యం అందుతున్నదంటే.. సీఎం కేసీఆర్కు పేదల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమని అన్నారు.
ప్రైవేట్ దవాఖానలకు రోగులు కరువు
‘ప్రైవేట్ హాస్పిటల్స్ వారికి పేషెంట్స్ దొరకడం లేదు. దీంతో వారు నా దగ్గరకు వచ్చి సార్ మేం కూడా మహిళలకు ఉచితంగానే డెలివరీలు చేస్తాం. ఆ కేసీఆర్ కిట్స్ మా హాస్పిటల్స్కు కూడా ఇవ్వండి అని అడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ప్రైవేటు దవాఖాలైతే డెలివరీకి నాలుగు రోజుల ముందే గర్భిణి ఇంటికి వచ్చి ఉచితంగా అంబులెన్స్లో తీసుకెళ్లి రోగితో పాటు వారి సహాయకులకూ ఉచిత భోజనం కల్పించి డెలివరీలు చేస్తున్నట్టు ఒక ఆశావర్కర్ ద్వారా తెలిసింది. కారణం ప్రతి ఒక్కరు ప్రభుత్వ దవాఖానకే వెళ్లటంతో ప్రైవేటు దవాఖానలకు రోగులు దొరుకుతలేరు’ అని మంత్రి హరీశ్ తెలిపారు.
ఆరోగ్యశ్రీ ద్వారా 25 కోట్లు విడుదల
ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు కావాలని ఇప్పుడే డైరెక్టర్ డాక్టర్ బీరప్ప కోరటంతో వెంటనే ఆరోగ్యశ్రీ సీఈవోతో మాట్లాడానని, రూ.25 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆదేశించానని హరీశ్ తెలిపారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.35 కోట్లు కూడా ఇప్పించాలని కోరడంతో, వాటి విడుదలకు ఆర్థిక శా ఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించినట్టు చెప్పారు.
తెలంగాణ వచ్చాకే నిమ్స్కు మహర్దశ
నిమ్స్ అంటే గత ప్రభుత్వాలకు చిన్నచూపు ఉండేదని, తెలంగాణ వచ్చాక పడకల సామర్థ్యాన్ని 900 నుంచి 1,500కు పెంచామని హరీశ్రావు తెలిపారు. 250 పడకల సామర్థ్యం గల ఎంసీహెచ్ సెంటర్ నిర్మాణంలో ఉన్నదని, ఇటీవలే సీఎం రూ.1,571 కోట్లతో 2,000 పడకల నిమ్స్ సూపర్స్పెషాలిటీ హాస్పిటల్కు శంకుస్థాపన చేశారని వివరించారు. వారం పది రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మొత్తం 4,000 పడక లతో నిమ్స్ దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ దవాఖానగా ఏర్పడనున్నదని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇక్కడ ఫ్యాకల్టీ సంఖ్య 111 ఉంటే, నేడు 264కు పెంచినట్టు తెలిపారు. నెఫ్రాలజి విభాగం వైద్యులు అద్భుతమైన సేవలు అందిస్తున్నారని, గతంలో ఏటా 25 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేస్తే ఇప్పుడు 150 ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నట్టు మంత్రి వివరించారు. 1989-2014 మధ్య 661 కిడ్నీ ట్రా న్స్ప్లాంట్స్ చేస్తే, తెలంగాణ వచ్చిన 9 ఏండ్లలో 753 సర్జరీలు చేసినట్టు వెల్లడించారు. బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ గతంలో 46 మాత్రమే చేస్తే, తెలంగాణ వచ్చాక 154 ట్రాన్స్ప్లాంట్స్ చేసినట్టు తెలిపారు. ఈ తొమ్మిదేండ్లలో 1,444 మోకాళ్ల మార్పిడులు జరిగినట్టు పేర్కొన్నారు. నిమ్స్లో మంచి వైద్య సిబ్బంది ఉన్నారని, అవసరమైతే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించి, అక్కడే స్పోర్ట్స్ క్లబ్, జిమ్, పిల్లలకు స్కూల్, రిక్రియేషన్ సెంటర్ వంటివి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని, ప్రతిపాదనలు ఉంటే ఇవ్వాలని నిమ్స్ సిబ్బందికి సూచించా రు. పీజీ సీట్లను 82 నుంచి 169 పెంచామని, ఆలిండియా టాప్ ర్యాంకర్లు నిమ్స్లో చదివేందుకు మొగ్గు చూపుతున్నారని అన్నారు.
కొందరు కండ్లు ఉండీ చూడలేరు
‘ప్రభుత్వం వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదన్నట్టు కొందరు మాట్లాడుతున్నరు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లూ మాట్లాడుతున్నరు. వారికి నిమ్స్ ఎంత బలోపేతంగా ఉన్న దో తెలుసు. లేకపోతే ఇతర రాష్ర్టాల వైద్య విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఎందుకు చేరుతరు’ అని హరీశ్రావు అన్నారు. కొందరు కండ్లు ఉండీ చూడలేరని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప పాల్గొన్నారు.
కార్పొరేట్ దవాఖానల నుంచి నిమ్స్ డైరెక్టర్కు ఫోన్లు
నిమ్స్ చరిత్రలో ఇంత పెద్ద పరికరం ఎన్నడూ కొనలేదని, గతంలో క్యాన్సర్కు సంబంధించి రూ.14 కోట్లతో పెట్ స్కాన్, రూ.11 కోట్లతో ఎమ్మారై వంటివి కొనుగోలు చేస్తే, అప్పట్లో అవే అత్యంత ఖరీదైనవిగా భావించేవారని మంత్రి హరీశ్ అన్నారు. నేడు రూ.32 కోట్లతో రోబో మిషన్ కొనడంతో కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి డైరెక్టర్కు ఫోన్లు వస్తున్నాయని, ‘అంత ఖరీదైన యంత్రాలు మీరెట్లా కొంటారు. సర్కార్ దవాఖానవా ళ్లు కూడా ఇంత పెద్ద మిషన్లు కొంటరా’ అని డైరెక్టర్ను ప్రశ్నిస్తున్నరు’ అని తెలిపారు.