Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): సంస్కరణలతో పారదర్శకతకు పెద్దపీట వేయడంతోపాటు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని రాష్ట్ర మున్సిపల్ శాఖ అద్భుత ఫలితాలను సాధిస్తున్నది. గత మూడేండ్లలో ప్రజలపై కొత్తగా నయాపైసా పన్ను భారాన్ని మోపకుండా రూ.473 కోట్లకుపైగా అదనపు ఆదాయాన్ని ఆర్జించింది. అవినీతికి, నిర్లక్ష్యానికి తావులేకుండా చూసేందుకు ‘మ్యాగ్జిమమ్ గవర్నెన్స్, మినిమమ్ గవర్నమెంట్’ విధానంలో ఇప్పటికే పలు సంస్కరణలను అమలు చేస్తూ పట్టణాలు, నగరాల్లో ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందిస్తున్నది. ఆధునిక సాంకేతికతను విరివిగా ఉపయోగించుకుంటూ మానవ ప్రమేయాన్ని గణనీయంగా తగ్గించడంతో పౌరులు ఈ సేవలను సులభంగా పొందగలుగుతున్నారు. తద్వారా ప్రజలకు వ్యయప్రయాసలు తప్పడంతోపాటు పట్టణ స్థానిక సంస్థలకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతున్నది.
సెల్ఫ్ అసెస్మెంట్
తెలంగాణలో ప్రజలు తమ ఆస్తులను తామే మదింపు చేసుకునేందుకు ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టంలో వీలు కల్పించింది. ఆస్తుల వివరాలను తప్పుగా నమోదు చేసినవారికి అపరాధ రుసుము విధిస్తున్నది. 2019 నుంచి ప్రారంభమైన ఈ విధానంలో ఇప్పటివరకు 1.69 లక్షల ఆస్తులను సెల్ఫ్ అసెస్మెంట్ చేశారు. దీని ద్వారా అదనంగా రూ.82.67 కోట్ల ఆదాయం సమకూరింది.
మ్యుటేషన్
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని భవనాలు, ఖాళీ స్థలాలను రిజిస్ట్రేషన్ సమయంలోనే పన్నుల పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సంస్కరణలను ప్రవేశపెట్టింది. తద్వారా రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే ఆటోమేటిక్గా మున్సిపల్ రికార్డుల్లో మ్యుటేషన్ అయ్యేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు. దీంతో ఆయా ఆస్తుల వివరాల ఆధారంగా కొత్త యజమాని పేరిట పన్ను జనరేట్ అవుతుంది. నిరుడు మార్చి మొదటి వారంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానం విజయవంతం కావడంతో పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ఇప్పటివరకు 2.42 లక్షల ఆస్తులను ఆటో మ్యుటేషన్ చేయడంతో మున్సిపల్ శాఖకు అదనంగా రూ.60.21 కోట్ల ఆదాయం వచ్చింది.
ఇండ్లకు జియో మ్యాపింగ్
రాష్ట్రంలో ప్రతి ఇంటి వాస్తవ వైశాల్యానికి అనుగుణంగా పన్ను వేయడంతోపాటు కొత్తగా జరిపిన అదనపు నిర్మాణాలకు పన్నులు వేసేందుకు దేశంలోనే తొలిసారి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) సహకారంతో జియో మ్యాపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ‘భువన్’ ద్వారా ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 20,54,216 ఇండ్లలో ఇప్పటివరకు 18 లక్షల ఇండ్లకు జియో మ్యాపింగ్ పూర్తి చేయడంతో రూ.121 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది.
టీఎస్బీపాస్
రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణాలకు సులభంగా అనుమతులిచ్చేందుకు టీఎస్బీపాస్ను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం.. పట్టణాల్లో ఇండ్ల నిర్మాణానికి ఈ విధానంలోనే అనుమతులు జారీ చేస్తున్నది. నిర్మాణం పూర్తయ్యాక ఆయా ఇండ్లకు పన్ను విధించేందుకు అవసరమైన వివరాలన్నీ టీఎస్బీపాస్ ద్వారా అధికారికంగా లభిస్తున్నాయి. ఇలా ఇప్పటివరకు 1.13 లక్షల ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం ద్వారా మున్సిపల్ శాఖకు రూ.126.64 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది.