హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): బాగా చదివిన విద్యార్థులు ఫస్టియర్ పరీక్షల్లో పాస్కాగా.. అస్సలు చదువనివారే ఫెయిలైనట్టు ఇంటర్బోర్డు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఫస్టియర్ ఫలితాలపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాకు ఇంటర్బోర్డు సెక్రటరీ సయ్యద్ ఉమర్ జలీల్ శనివారం వేర్వేరుగా నివేదికలు అందజేశారు. ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం ఆరా తీసింది. వాస్తవిక పరిస్థితులపై నివేదికను కోరింది. సమగ్ర నివేదికను రూపొందించిన ఉమర్ జలీల్ శనివారం ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ఫలితాలపై విద్యార్థి సంఘాల ఆందోళనలు, తల్లిదండ్రులు, విద్యార్థుల్లో నెలకొన్న సందేహాల నేపథ్యంలో ఇంటర్బోర్డు అధికారులు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఇంటర్ ఫస్టియర్లో ఫలితాలు తగ్గడానికి కరోనా పరిస్థితులే కారణమని అధికారులు విశ్లేషించారు. ఇంటర్ ఫస్టియర్లో ఉత్తీర్ణత శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంటున్నది. హాజరయ్యే విద్యార్థుల్లో సరాసరిగా 60 శాతం విద్యార్థులు మాత్రమే పాసవుతున్నారు. ఈ ఏడాది 11 శాతం ఫలితాలు తగ్గడానికి కరోనా పరిస్థితులే కారణమని అధికారులు తెలిపారు. 2020 సంవత్సరంలో మాత్రం 100 శాతం ఉత్తీర్ణులయ్యారు. కరోనాతో ఆ సంవత్సరంలో పరీక్షలు నిర్వహించక బ్యాగ్లాగ్ సబ్జెక్టులకు మినిమం 35 శాతం మార్కులేసి పాస్చేశారు.
ఇంటర్ రీ వెరిఫికేషన్కు 4,670 దరఖాస్తులు
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు దరఖాస్తు చేసుకుంటున్నారు. శనివారం వరకు మొత్తం 4,670 దరఖాస్తులు వచ్చాయి. ఫస్టియర్ ఫలితాలు ఈ నెల 16న విడుదలయ్యాయి. ఫలితాల్లో 2.35 లక్షల మంది ఫెయిలయ్యారు. వీరికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోమని, ఏప్రిల్లో వార్షిక పరీక్షలు రాసుకోవాల్సిందేనని ఇంటర్బోర్డు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో రీ వెరిఫికేషన్కు 3,913 మంది, రీ కౌంటింగ్కు 757 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులకు ఈ నెల 22 వరకు గడువు ఉండటంతో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.