5 జిల్లాల్లో వడగాలులు
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. సహజంగా మే నెల మధ్యలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఏప్రిల్లోనే రికార్డవుతున్నాయి. ఉద యం 10 గంటల నుంచే సూర్యుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయం లో ఫ్యాన్ గాలి కూడా వేడిగా వస్తుండటంతో ప్రజ లు ఉడికిపోతున్నారు. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లో వడగాలులు వీచినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది.
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం నుంచి వస్తున్న వేడి గాలులతో ఉత్తర తెలంగాణలో వడగాలులు వీస్తున్నాయని వాతావరణ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 41.3 నుంచి 44.9 డిగ్రీల మధ్య నమోదైనట్టు టీఎస్డీపీఎస్ పేర్కొన్నది. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 44.9 డిగ్రీలు రికార్డు కాగా.. ములుగు జిల్లా మేడారం, నిర్మల్ జిల్లా ఖానాపూర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, జయశంకర్ జిల్లా గోరు కొత్తపల్లిలో 44.8 డిగ్రీలు, 11 జిల్లాల్లో 44 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది.పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్లో 11 మిల్లీ మీటర్ల వర్షం పడినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది.
ఈదురుగాలులు, వర్షాలు
రాష్ట్రంలో ఈ నెల 24 వరకు పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని పేర్కొన్నది.48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రాత్రి మేఘాలు ఏర్పడే అవకాశం ఉన్నదని తెలిపింది.