Weather Alert | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం తొమ్మిదింటికే భానుడు భగ్గుమంటున్నాడు. ఉష్ణోగ్రతలు ఈ నెల చివరి వరకు 45 డిగ్రీలకు చేరుతాయని వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నారు. మే నెలలో కొన్ని చోట్ల 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. సాయంత్రం పూట కొన్నిచోట్ల మబ్బులు కమ్ముతున్నా.. పగలు మాత్రం భానుడు భగభగమంటున్నాడు. సోమవారం 18 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. 7 జిల్లాల్లో పలుచోట్ల 44 డిగ్రీలకు పైనే రికార్డయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా మంథనిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 44.8 డిగ్రీలు, నల్లగొండ జిల్లా కట్టంగూర్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జంబుగలో 44.7, పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కళ్లపల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 44.4, జగిత్యాల జిల్లా గోదూరులో 44.3, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు హెచ్చరించారు.
యూవీ కిరణాలతో ఎండ వేడి
రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నా.. ఆయా ప్రాంతాల్లో ఎండ వేడి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటున్నది. ఆకాశంలో ఓజోన్ పొర కరిగి సూర్యుడి నుంచి వెలువడే యూవీ (అతినీల లోహిత) కిరణాలు భూమిపైకి చేరుతుండటంతో రేడియేషన్ పెరుగుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎండ తీవ్రత తక్కువగా ఉన్న.. ఎండ వేడిమి ఎక్కువగా ఉంటున్నదని వివరిస్తున్నారు. మరో వైపు 8 జిల్లాలో ఉక్కపోత అధికంగా ఉన్నది. గాలిలో తేమ శాతం ఎక్కువగా నమోదవుతుంది. అత్యధికంగా మెదక్ జిల్లా శివంపేటలో గాలిలో తేమ 100 శాతం రికార్డయింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ 60 శాతానికిపైగానే హ్యుమిడిటీ లెవెల్స్ రికార్డయ్యాయి.
హైదరాబాద్లో వడగండ్ల వాన
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. నగర శివారుతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల వడగండ్ల వర్షం కురిసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు దంచికొట్టిన ఎండతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం కురిసిన వానతో వాతావరణం చల్లబడి ఉపశమనం పొందారు. వడగండ్ల వాన కారణంగా కార్యాలయాల నుంచి ఇండ్లకు వెళ్లేవారు కొంత ఇబ్బంది పడ్డారు.