హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో తమకు డిపాజిట్లు తగ్గినా ప్రాధాన్య రంగాలకు రుణాల వితరణను ఆపలేదని రాష్ట్రస్థాయి బ్యాం కర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) పేర్కొన్నది. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో డిపాజిట్లు రూ.2,073 కోట్ల మేరకు తగ్గాయని, అయినా ప్రాధాన్య రంగాలకు రూ.42,783.71 కోట్ల రుణాలు ఇచ్చామని, ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్ధేశించుకొన్న లక్ష్యంలో ఇది 30.74 శాతానికి సమానమని వెల్లడించింది. వానకాలం పంటల సాగుకు రూ.9,771. 71 కోట్లు.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.22,298. 55 కోట్ల రుణాలను అందజేసినట్టు వివరించింది.
శుక్రవారం ఈ కమిటీ హైదరాబాద్లో సమావేశమై తొలి త్రైమాసిక కార్యకలాపాలపై సమీక్ష జరిపింది. ఎస్ఎల్బీసీ ప్రెసిడెంట్, ఎస్బీఐ సీజీఎం అమిత్ జింగ్రాన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ బ్యాంకింగ్ సేవలు విస్తరించాయని, 500 మంది కంటే ఎక్కువ జనాభా ఉన్న అన్ని గ్రామాలతోపాటు కొండ ప్రాంతాల్లోనూ బ్యాం కు సేవలు అందుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ కే నిఖిల, నాబార్డ్ సీజీఎం చింతల సుశీల, ఎస్ఎల్బీసీ కన్వీనర్ దేవాశిష్ మిశ్రా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.