హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. 4,233 ప్రత్యేక బస్సులను నడుపాలని నిర్ణయించింది. 585 సర్వీసులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ప్రత్యేక బస్సులను జనవరి 7 నుంచి 15 వరకు నడుపనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈ సంక్రాంతికి 10 శాతం అదనపు బస్సులను నడుపనున్నట్టు తెలిపారు.
ఈ సారి ఆంధ్రప్రదేశ్లోని అమలాపురానికి 125, కాకినాడ 117, కందుకూరు 83, విశాఖపట్నం 65, పోలవరం 51, రాజమండ్రికి 40 ప్రత్యేక బస్సులను నడుపాలని నిర్ణయించినట్టు పేరొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్ వ్యవధిని 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచినట్టు తెలిపారు.