హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ సంక్షేమ పథకాల్లో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ విధానాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి రైతు తన వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వేగంగా ఫార్మర్ రిజిస్ట్రీని పూర్తి చేసిన తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో) నిరంతర కృషితో ఇది సాధ్యమైంది. ప్రతి రైతుకూ ఈ కార్యక్రమ ప్రాధాన్యంపై అవగాహన కల్పించి వివరాలు నమోదు చేయించారు. ఈ నేపథ్యంలో ఫార్మర్ రిజిస్ట్రీలో మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకం కింద రూ.422 కోట్లు మంజూరు చేసింది. అయితే, వ్యవసాయ శాఖకు దక్కిన ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకునే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచనపై ఏఈవోలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టానికి ఫలితంగా వ్యవసాయ శాఖకు దక్కిన నిధులను రైతు సంక్షేమం కోసమే వినియోగించాలని కోరుతున్నారు.
కనీస సౌకర్యాలు లేక శిథిలావస్థకు చేరుతున్న రైతు వేదికలను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులను ఉపయోగించాలని సూచిస్తున్నారు. వాస్తవానికి, బీఆర్ఎస్ హయాంలో రైతులను సంఘటితం చేయడంతోపాటు వారందరికీ వ్యవసాయంలో నూతన విధానాలపై శిక్షణ ఇచ్చేందుకు 2,601 రైతు వేదికలను నిర్మించారు. ప్రస్తుత ప్రభుతం కూడా రైతు వేదికల్లో రైతునేస్తం పేరుతో ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నది. అయితే, కనీస సౌకర్యాల కల్పనపై దృష్టిపెట్టడం లేదనే విమర్శలున్నాయి. సమావేశాలకు వచ్చే రైతులకు కనీసం తాగునీరు కూడా కల్పించే పరిస్థితి లేకుండా పోయింది. రైతు వేదికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో కిటీకులు, తలుపులు పాడై మం దుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి వచ్చిన రూ.422 కోట్లను రైతు వేదికల అభివృద్ధికి కేటాయించాలని, వీడియో కాన్ఫరెన్స్ల నిర్వహణకు అవసరమైన ఇంటర్నెట్, కుర్చీలు, టీవీలు లాంటివి ఏర్పాటు చేయడం కోసం వినియోగించాలని ఏఈవోలు సూచిస్తున్నారు. లేనిపక్షంలో డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే కోసం ఇస్తున్నట్టుగానే ఫార్మర్ రిజిస్ట్రీకి కూడా తమకు ప్రోత్సాహకం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.