చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 4: ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతిలో నాటిన 400 చెట్లు చిగురించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం, ధర్మోజిగూడెం పరిధిలో 65వ జాతీయ రహదారి పక్కన నాటిన చెట్లు కొత్త కొమ్మలు వేసి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ధర్మోజిగూడెం సమీపంలోని ఓ వెంచర్ నిర్వాహకులు హెచ్ఎండీఏ అనుమతితో 3 నెలల క్రితం 400 చెట్లను తొలగించారు. వాటిని కిలోమీటర్ దూరంలో ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతిలో సర్వీసు రోడ్డులో నాటారు. వాటి సంరక్షణ బాధ్యతను హెచ్ఎండీఎ అధికారులు తీసుకున్నారు. ప్రస్తుతం చెట్ల మొదళ్లు చిగురించడంతో ఆ మార్గంలో వెళ్లేవారు ఆసక్తిగా చూస్తున్నారు.