హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): బీసీ కుల, చేతివృత్తిదారులకు లక్ష సాయం అందించేందుకు ప్రభుత్వం అదనంగా 200 కోట్లు కేటాయించింది. బడ్జెట్లో కేటాయించిన 300 కోట్లకు అదనంగా తాజాగా మంజూరు చేసింది. తొలి విడతలో 100 కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం.. మంగళవారం ఏకమొత్తంలో ఒకేసారి 400 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సాయం కోసం రాష్ట్రవ్యాప్తంగా 5.12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అర్హులను గుర్తింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటివరకు గుర్తించిన అర్హులకు ఎమ్మెల్యేల ద్వారా చెక్కులను అందించనున్నారు.