హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాలేజీలకు వేసవి సెలవుల ఘట్టం తుది దశకు చేరింది. ఇంటర్, డిగ్రీ కాలేజీలకు వేసవి సెలవులు బుధవారంతో ముగియనున్నాయి. గురువారం నుంచి ఇంటర్ కాలేజీలు, జూన్ రెండో వారంలో డిగ్రీ కళాశాలలు పునఃప్రారంభంకానున్నాయి. పాలిటెక్నిక్ కళాశాలలు మాత్రం జూలైలో ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో అధికారులు 202324 విద్యాసంవత్సరానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. కాలేజీల్లో మౌలిక వసతుల కల్పన, విద్యాప్రమాణాల పెంపునకు ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇంటర్ కాలేజీల్లో అన్ని రకాల వసతుల కల్పనకు మొత్తం రూ.400 కోట్ల వరకు వెచ్చించనున్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో అదనపు తరగతి గదులు, హాస్టళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రూ.301.24 కోట్ల వ్యయంతో వసతుల కల్పన చేపడుతారు. 407 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు కంప్యూటర్లు అందజేస్తారు. సైన్స్, వొకేషనల్ ప్రయోగశాలలకు అవసరమైన పరికరాలు, ఉపకరణాల పంపిణీ చేపడుతారు.