హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ)/ బంజారాహిల్స్: హైదరాబాద్ నగరంలో 40శాతం మంది రక్తపోటు సమస్యలతో సతమతం అవుతున్నారు. 70శాతం మంది ఊబకాయంతో బాధపడుతుండగా.. ప్రతి నలుగురిలో ఒకరు హైపర్టెన్షన్ బాధితులేనని తేలింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కు చెందిన శాస్త్రవేత్తల సాయంతో కార్డియాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా-హైదరాబాద్ చాప్టర్ (సీఎస్ఐ), గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ (జీజీహెచ్) సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 9 వేల మంది హైదరాబాద్ నగరవాసులపై అధ్యయనం చేసి రూపొందించిన ఈ నివేదికను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మంగళవారం విడుదల చేశారు. ‘ప్రపంచ హైపర్ టెన్షన్ డే’ను పురస్కరించుకుని జీజీహెచ్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి ఈ అధ్యయన ఫలితాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. జీవనశైలిలో మార్పులతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో బీపీ బాధితుల సంఖ్య పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. నిమ్స్లో ఇటీవల జరిపిన ఓ సర్వే ప్రకారం కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారిలో 60 శాతం మందికి హైపర్ టెన్షన్ ఉన్నదని మంత్రి చెప్పారు. బీపీ, షుగర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేనిపక్షంలో అవి ప్రాణాంతకంగా మారుతాయని హెచ్చరించారు. ఈ సమస్యను ముందుగానే గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులందరికీ అసంక్రమిత వ్యాధుల (ఎన్సీడీ) నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నదని చెప్పారు. ఇప్పటివరకు 90 లక్షల మందికి స్రీనింగ్ చేస్తే.. 13 లక్షలు మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు తేలిందన్నారు. ఎన్సీడీ స్క్రీనింగ్లో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నామని, త్వరలో అగ్రస్థానానికి చేరుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ బీపీ, షుగర్ టెస్టులు చేయించుకోవాలన్నారు.
రూ.33కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా బీపీ, షుగర్ టెస్టులు
రానున్న మూడు నెలల్లో రాష్ట్రంలో ప్రతి ఒకరికీ బీపీ, షుగర్ టెస్టులు పూర్తిచేస్తామని, ఇందుకోసం రూ.33 కోట్లు కేటాయించామని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. వ్యాధి నిర్ధారణ అయినవారికి ఉచితంగా మందుల కిట్ను అందజేస్తామని చెప్పారు. మరోవైపు ఆయుష్ ద్వారా 450 వెల్నెస్ సెంటర్లు ఏర్పాటుచేసి ఆరోగ్యంపై శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం నగరంలోని బస్తీ దవాఖానల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల వైద్యపరీక్షలు చేస్తున్నామని, వచ్చే నెల నుంచి వీటి సంఖ్యను 120కి పెంచనున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎస్ఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు రాజీవ్ గార్గ్ మాట్లాడుతూ.. రానున్న కాలంలో హైదరాబాద్ నగరంలో 50శాతంమంది హైపర్టెన్షన్ బారినపడే ప్రమాదముందని హెచ్చరిచారు. 25నుంచి 50 ఏండ్ల లోపు వయస్సున్న వారిని పరీక్షించామని, యువతలో కూడా అధిక రక్తపోటు. మధుమేహం కనిపించడం ఆందోళన కలిగిస్తోందన్నారు.