హైదరాబాద్, శేరిలింగంపల్లి డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఇటీవల నిర్వహించిన ప్లేస్మెంట్స్ డ్రైవ్లో ఈ ఏడాది 40 శాతం ఉద్యోగాలు విద్యార్థినులే దక్కించుకొన్నారు. ఐఎస్బీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ (పీజీపీ) కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగాలివ్వడానికి 222 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు క్యూకట్టాయి. 1,578 ఆఫర్లను విద్యార్థులకు కల్పించాయి. అత్యధికంగా 36 మంది విద్యార్థులు ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్స్ను దక్కించుకొన్నారు.
ఈ ఏడాది సగటు వార్షిక వేతన ప్యాకేజీ 34.21 లక్షలకు చేరింది. ఐటీ, ఐటీఈఎస్, టెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, ఫాస్ట్మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, రిటైల్, కన్సల్టింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్, జనరల్ మేనేజ్మెంట్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, సప్లయ్చైన్ అండ్ లాజిస్టిక్స్లలో విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ఈ సందర్భంగా ఐఎస్బీ డిప్యూటీ డీన్ ప్రొఫెసర్ రామభద్రన్ తిరుమలై మాట్లాడుతూ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఐఎస్బీ తన పాఠ్యాంశాలు, బోధన విధానాలు, పద్ధతులను అందిపుచ్చుకొంటూ ముందుకు సాగుతున్నదని తెలిపారు. పీజీపీ విద్యార్థులు పెద్దసంఖ్యలో ప్లేస్మెంట్ సాధించారని పేర్కొన్నారు.