హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా వైద్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన సదుపాయాలు కల్పిస్తున్న కేసీఆర్.. హైదరాబాద్ నగరానికి నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎల్బీనగర్, అల్వాల్, సనత్నగర్లలో నిర్మించే ఆస్పత్రుల నిర్మాణానికి రూ. 2,679 కోట్లు కేటాయిస్తూ.. వైద్యారోగ్య శాఖ పరిపాలనపరమైన ఉత్తర్వులను గురువారం జారీ చేసింది. ఇప్పటికే గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో ఆస్పత్రిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
రూ. 900 కోట్లతో ఎల్బీనగర్లో, రూ. 882 కోట్లతో సనత్నగర్లో, రూ. 897 కోట్లతో అల్వాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు జీవో ఎంఎస్ 41లో పేర్కొన్నది. ఆస్పత్రుల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని టీఎస్ఎంఎస్ఐడీసీని, డీఎంఈలకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆస్పత్రులకు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
నగర శివార్లలో నలు దిక్కులా నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు నిర్మాణం అయితే పెద్ద సంఖ్యలో రోగులకు వైద్య సేవలు అందిస్తోన్న గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లపై ఒత్తిడి తగ్గనుంది. గచ్చిబౌలి, అల్వాల్, సనత్ నగర్, ఎల్బీనగర్లలో నిర్మించే ఈ ఆస్పత్రుల నిర్మాణం వల్ల జిల్లాల నుంచి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించవచ్చు. అల్వాల్లో ఏర్పాటు చేసే ఆసుపత్రికి సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే రోగులు చక్కటి వైద్యం పొందే అవకాశం ఉంది.
అదే రీతిలో ఎల్బీనగర్ ఆస్పత్రికి ఖమ్మం, నల్గొండ, సూర్యపేట జిల్లాల నుంచి వచ్చే రోగులు వైద్యం పొందే వీలుంది. అదే రీతిలో గచ్చిబౌలి, సనత్ నగర్ ఆస్పత్రులకు వచ్చే రోగులకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయి. గతంలో ఏదైనా అత్యవసర వైద్య సేవలు కావాలంటే నిమ్స్ కో, గాంధీకో తరలించాల్సిన పరిస్థితి ఉండేది. ట్రాఫిక్ కారణంగా అందాల్సిన వైద్యం సకాలంలో అందక రోగులు చనిపోయిన సందర్బాలు ఉన్నాయి. నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే జిల్లాల నుంచి అత్యవసర వైద్య సాయం కావాల్సిన రోగులకు ట్రాఫిక్ బెడద లేకుండా నగర శివార్లలోనే అత్యుత్తమ, అత్యవసర వైద్య సేవలు అందించే అవకాశం కలుగుతోంది. దీంతో పాటు గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులకు రోగుల ఒత్తిడి తగ్గుతుంది.