హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో షెడ్యూల్ వెలువడక ముందే ఎన్నికల సంఘం (ఈసీ) అప్రమత్తమైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రంగంలోకి దిగడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, అప్పటికే అభ్యర్థులు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారని గుర్తించిన ఎన్నికల సంఘం ఈసారి ముందుగానే నిఘా వ్యవస్థను బలోపేతం చేసింది. ఓటర్లను ప్రలోభపెట్టే అభ్యర్థులు, రాజకీయ నాయకులపై పటిష్ఠ నిఘా పెట్టింది. దీనిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 20 ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో 4 సబ్ గ్రూపులను ఏర్పాటు చేసింది.
ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటీ, డీఐయూ, ఆర్బీఐ, ఎయిర్పోర్ట్, జీఎస్టీ, ఎస్జీఎస్టీ, డీఆర్ఐ, నార్కొటిక్స్ కంట్రోల్, సీబీడీటీ, సీబీఐటీ, కస్టమ్స్, వాణిజ్య పన్నులు, స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ, సీఐఎస్ఎఫ్ విభాగాలతోపాటు అటవీ, పోస్టల్, రవాణాఖ, ఆర్అండ్బీ శాఖల ప్రతినిధులతో ఇవి ఏర్పాటయ్యాయి. మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి, అమ్మకాలు, ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లు, బ్యాంకుల నుంచి నగదు విత్డ్రాలు తదితరాలపై ఈ సబ్ గ్రూపులు నిఘా పెడుతున్నాయి. సాధారణ స్థాయి కంటే 20% అధికంగా జరిగే అన్నిరకాల లావాదేవీలపై దృష్టి సారిస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో ఈసీ ఇప్పటికే మూడుసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించింది. వచ్చే నెల రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సైతం ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.