నిజామాబాద్ క్రైం, జనవరి 8: అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిన ఓ వ్యాపారి కుటుంబం విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు కొడుకులతో కలిసి దంపతులు శనివారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడ్డారు. బస చేసిన సత్రంలో తల్లి, చిన్నకొడుకు విషం తీసుకోగా.. కృష్ణానదిలో దూకి తండ్రి, పెద్ద కొడుకు ప్రాణాలు తీసుకొన్నారు. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్-2 పరిధిలో ఉన్న శ్రీచైతన్య అపార్ట్మెంట్లోని 207 ఫ్లాట్లో నివాసముంటున్న పప్పుల సురేశ్ (48) వ్యాపారి. ఆయనకు భార్య శ్రీలత (43), కొడుకులు అఖిల్ (26), ఆశిష్ (22) ఉన్నారు. సురేశ్ స్థానికంగా ఓ పెట్రోల్బంక్ను లీజ్ కు తీసుకొని నడుపుతున్నారు. మూడేండ్ల క్రితం వరకు ఓ మెడికల్ దుకాణం నడిపిన సురేశ్.. అనుకోని పరిస్థితుల్లో మూసివేశారు. ప్రత్యామ్నాయ ఉపాధిపై దృష్టిపెట్టిన ఆయన.. కుటుంబ పోషణ కోసం పరిచయస్తుల వద్ద అప్పులు చేస్తూ వచ్చాడు. గత ఏడాది సుభాష్నగర్లోని ఓ పెట్రోల్ బంకును అద్దెకు తీసుకున్న సురేశ్.. పెద్దకొడుకు అఖిల్కు దాని నిర్వహణను అప్పగించాడు. చిన్నకొడుకు ఆశిష్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. బాకీలు తీర్చే క్రమం లో చేసిన అప్పులువారిని మరింత ఊబిలోకి నెట్టా యి. ఈ క్రమంలో తమ ఫ్లాట్పై పిరామిల్ క్యాపిటల్ హౌసింగ్ఫైనాన్స్ సంస్థ వద్ద లోన్ తీసుకున్నారు. అప్పులవాళ్ల వేధింపులు తీవ్రమవడంతో ఐదురోజుల క్రితం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. వాయిదా చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ ఇంటికి నోటీసులు అతికించింది.విషయం తెలుసుకున్న సురేశ్ తీవ్ర వేదనకు గురయ్యారు. శుక్రవారం విజయవాడ కనకదుర్గ ఆలయం చేరుకొని అక్కడి ఆర్యవైశ్య సత్రంలో పెద్ద కొడుకు అఖిల్ పేరిట గదిని అద్దెకు తీసుకొన్నారు. పెరిగిపోయిన అప్పులతో పరువుపోవడం, దారితెన్నూ కనిపించకపోవడంతో కుమారులతో కలిసి సురేశ్, శ్రీలత ఆత్మహత్యకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది.
శుక్రవారం దుర్గమ్మను దర్శించుకున్న కుటుంబం శనివారం తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో బంధువుల ఫోన్లకు మెస్సేజ్ పెట్టారు. అప్పుల బాధ తాళలేక చనిపోతున్నామంటూ పేర్కొన్నారు. ఉద యం గుర్తించిన బంధువులు సత్రం నిర్వాహకులకు ఫోన్చేశారు. సిబ్బంది వెళ్లి చూడగా శ్రీలతతోపాటు ఆశిష్ చనిపోయినట్టు గుర్తించారు. అఖిల్తో కలిసి సురేశ్ కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం నగరంలో విషాదం నింపింది.