కొత్తగూడెం క్రైం, ఫిబ్రవరి 27: ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. బీజాపూర్ జిల్లాలోని చోటే తుంగలి అటవీప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందని సమాచారం అందుకున్న డీఆర్జీ, సీఆర్పీఎఫ్ భద్రతా దళాలు ఆ ప్రాంతంలో మంగళవారం సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. ఇరువర్గాల మధ్య సుమారు 40 నిమిషాల పాటు భీకరపోరు జరిగింది. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూ దట్టమైన అటవీప్రాంతంలోకి పారిపోయారు. కాల్పుల విరమణ అనంతరం భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఘటనా స్థలంలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. మృతుల వివరాలు తెలియరావాల్సి ఉన్నది.