హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): మరో 10-15 రోజుల్లో వానకాలం సీజన్ ప్రారంభం కానుండటంతో వ్యవసాయానికి అవసరమైన ఎరువుల సరఫరాను వ్యవసాయశాఖ ముమ్మరం చేసింది. ఏ జిల్లాకు ఎంత మేర ఎరువులు అవసరమో లెక్కగట్టి పంపుతున్నది. ఇప్పటికే ప్రాథమిక దశలో 4.20 లక్షల టన్నుల యూరియాను జిల్లాలకు సరఫరా చేసింది. ఇందులో మార్క్ఫెడ్ తన వద్ద 2.13 లక్షల టన్నుల యూరియా, 11,857 టన్నుల డీఏపీ, 41,540 టన్నుల కాంప్లెక్స్ ఎరువులను బఫర్ స్టాక్గా పెట్టుకున్నది. ఈ వానకాలం సీజన్లో 1.42 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని, ఇందుకు సుమారు 24.45 లక్షల టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 10.50 లక్షల టన్నుల యూరియా, 9.40 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రైతులకు ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచేందుకు ఇతర రాష్ర్టాలతో పాటు రామగుండం ఫ్యాక్టరీ నుంచి ప్రభుత్వం యూరియాను కొనుగోలు చేస్తున్నది.
పక్కా ప్రణాళిక
ఎరువుల సరఫరాలో ఈ సీజన్లో వ్యవసాయ శాఖ పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నది. పలు శాఖల అధికారుల నేతృత్వంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నది. ప్రతి జిల్లాకు ఏయే ఎరువులు ఎంతమొత్తంలో అవసరమో కచ్చితంగా తెలుసుకొని, ఆ మేరకు సరఫరా చేస్తున్నారు. ఏ నెల ఏ జిల్లాకు ఎంతమొత్తంలో ఎరువులు పంపించాలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందింది. పంట విస్తీర్ణాన్ని బట్టి ఎరువుల సరఫరాపై జిల్లా అధికారులు నిర్ణయం తీసుకుంటారు.
గ్రామాల్లోకి ఎరువుల లోడ్ రాగానే ఎలాంటి ఆలస్యం చేయకుండా రైతులకు సరఫరా చేస్తారు. ఇందులో భాగంగా ముందుగానే రైతులకు సమాచారం అందించాలని స్థానిక అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇక డీలర్లకు అధిక కేటాయింపులపైనా వ్యవసాయ శాఖ నజర్ పెట్టింది. రిటైల్ డీలర్లకు రెండు ట్రక్కులకు మించి ఎరువులను కేటాయించకూడదని నిర్ణయించింది. సరిహద్దు రాష్ర్టాల్లో ఎరువుల అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు. ఎరువుల సరఫరా, అవసరంపై ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయశాఖ ఆదేశించింది.