బంగారు పంటలు పండిస్తున్న సేద్యం.. దండిగ ఉద్యోగాలిస్తున్న పరిశ్రమ.. దేశానికే ఆదర్శంగా నిలిచిన సంక్షేమం.. ద్వేషానికి తావులేని ఆధ్యాత్మిక పరిమళం.. విరజిమ్ముతున్న తెలంగాణ రాష్ట్రంలో సకలజనుల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకొన్నది.
ఒకనాడు అష్టకష్టాలతో కునారిల్లిన ఒక్కొక్క రంగాన్ని లెక్క సరిచేసుకుంటూ, సరిదిద్దుకుంటూ వస్తున్న కేసీఆర్ నిరుపేదలకు గూడు కల్పించడమే ధ్యేయంగా భారీ నిర్ణయాలు తీసుకున్నారు. పేదవాడు తన సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. అంతేకాదు.. గత ప్రభుత్వాలు ఇంటిపేరుతో పేదల నెత్తిన మోపిన బాకీల భారాన్ని మాఫీ చేయాలని నిశ్చయించారు. ఎక్కడుండాలో తెల్వక, నిలువ నీడలేక అనివార్యపరిస్థితుల్లో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న లక్షలాది మందికి ఆ స్థలాలను క్రమబద్ధీకరించబోతున్నారు.
మానవీయ సంక్షేమమే కాదు.. మరోవైపు మహనీయ ఆధ్యాత్మికం.. ఉప్పొంగే భక్తి భావనతో కాశీ యాత్రకు, శబరిమల దీక్షకు వెళ్లే లక్షలాది తెలంగాణ భక్తుల కోసం అటు వారణాసిలో, ఇటు శబరిమలైలో రూ.50 కోట్లతో భారీ వసతి గృహాలు నిర్మించబోతున్నారు. మరో లక్షా 30 వేల మందికి దళితబంధు, అడవిని దున్ని సాగుచేసుకుంటున్న గిరిజన సోదరులకు 4 లక్షల ఎకరాల పోడు భూముల పంపిణీ, ఏప్రిల్ నుంచి మళ్లీ గొర్రెల యూనిట్ల వితరణ, యాసంగిలో పండే వరి ధాన్యం కొనుగోలు..
ఇలా ఒక క్యాబినెట్ సమావేశం.. అనేక ప్రజాహిత నిర్ణయాలు! ఆరు గంటల చర్చలు.. లక్షల మంది తెలంగాణ ప్రజలకు ప్రయోజనాలు!! అందుకే ఆయన ప్రజా నాయకుడు.. తెలంగాణే ఆయన తొలి శ్వాస… ప్రజాహితమే ధ్యాస! పరిపాలన ఆయనకు తపస్సు!! సర్వోతోముఖ సమ్మిళిత తెలంగాణే ఆయన యశస్సు.. అందుకే దేశానికి కేసీఆర్ రేపటి ఉషస్సు!!
ఎన్నికల దృష్టితో అధికారంపై యావతో విపక్ష విదూషక పాత్రలు.. యాత్రల పేరుతో తిట్టుకుంటూ తిరుగుతుండగా, కేసీఆర్ మాత్రం తెలంగాణ ప్రజాహితమే ధ్యేయంగా తన ఆలోచన మథనాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణకు ఏం కావాలో కేసీఆర్కు తెలుసు. కేసీఆర్ ఏమిటో తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే విపక్ష నేతలు కార్నర్ మీటింగులు పెట్టుకుంటే ప్రజలు వారినే కార్నర్ చేస్తున్నారు. దటీజ్ కేసీఆర్.
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): పేదల గృహ నిర్మాణం కోసం తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకొన్నది. సీఎం కేసీఆర్ శాసనసభలో చెప్పినట్టుగానే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకొనేందుకు ఆర్థిక స్థోమతలేని పేదల కోసం ‘గృహలక్ష్మి పథకం’ ప్రారంభించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తూనే.. గృహలక్ష్మి పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ. 3 లక్షల చొప్పున గ్రాంటుగా ఇవ్వాలని నిర్ణయించింది. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో వివిధ గృహనిర్మాణ పథకాల కింద లబ్ధిదారుల వాటాతో నిర్మించిన ఇండ్లకు సంబంధించిన రూ. 4 వేల కోట్ల అప్పును ప్రభుత్వం మాఫీ చేయాలని నిర్ణయించింది. దీంతో 30 లక్షల మందికి ఊరట లభించనున్నది. అలాగే, స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవో-58, 59 కటాఫ్ గడువును 2020కి పెంచుతూ నిర్ణయించిన నేపథ్యంలో కొత్తగా దరఖాస్తు చేసుకొనేందుకు మరో నెల సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నది. అలాగే, కాశీ, శబరిమలకు వెళ్లే రాష్ట్ర భక్తుల సౌకర్యార్థం ఈ రెండుచోట్లా రూ.25 కోట్ల చొప్పున ఖర్చుతో వసతిగృహ సముదాయాలు నిర్మించాలని నిర్ణయించింది. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నది. రెండో విడత దళితబంధు పథకం, గొర్రెల పంపిణీ కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని నిర్ణయం తీసుకొన్నది. సమావేశం అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, మంత్రులు గంగుల కమలాకర్, ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి తదితరులతో కలిసి క్యాబినెట్ తీసుకొన్న నిర్ణయాల వివరాలను విలేకరులకు వెల్లడించారు. రెండో విడత దళితబంధు పథకం కింద లక్షా 30 వేల కుటుంబాలకు సహాయం అందించాలని, ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశిస్తూ నిర్ణయం తీసుకొన్నట్టు మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఈ పథకంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని, వివిధ రాష్ర్టాలనుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులు వచ్చి అధ్యయనం చేసి వెళ్తున్నారని పేర్కొన్నారు. దళితులకు రూ.10 లక్షల చొప్పున ఉచిత గ్రాంటు ఇచ్చే దళితబంధు పథకం 2021 ఆగస్టు 16న ప్రారంభం కాగా, ఏటా ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున దళితబంధు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకుగాను హుజూరాబాద్లో ఇప్పటికే 100 శాతం దళితబంధు పథకం అమలు అయిందని, మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 1,100 మందికి ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 118 నియోజకవర్గాలకు 1,29,800 మందికి ఇవ్వనున్నట్టు చెప్పారు. మరో 200 మంది లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను చీఫ్ సెక్రటరీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు. మొత్తంగా లక్షా 30వేల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. గతంలో మాదిరిగానే జిల్లా కలెక్టర్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు.
పేదల గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా సొంత ఇంటి జాగా ఉన్నవారు ఇండ్లు నిర్మించుకొనేందుకు ‘గృహలక్ష్మి’ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇండ్లు లేనివారితోపాటు గతంలో ఇల్లు ఉండి అవి కూలిపోయినవారికి ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 4 లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు. ఒక్కో నియోజకవర్గానికి 3 వేల చొప్పున, 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించాలని నిర్ణయించినట్టు చెప్పారు. వీటితోపాటు 43 వేల ఇండ్లను స్టేట్ కోటాలో మంజూరు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణ ప్రక్రియ వెంటనే చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. ఒక్కో ఇంటికి రూ.మూడు లక్షలను మూడు దఫాలుగా లక్ష చొప్పున లబ్ధిదారుడి ఖాతాలో జమచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. లబ్ధిదారుడు తనకు నచ్చిన విధంగా ఇల్లు కట్టుకొనేలా వెసులుబాటు కల్పిస్తున్నట్టు వివరించారు. దీనికోసం బడ్జెట్లో ఇప్పటికే రూ.12 వేల కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. ఇండ్లను మహిళ పేరుపైనే మంజూరు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. గత ప్రభుత్వాలు గృహ నిర్మాణ సంస్థ ద్వారా పేదలకు ఇండ్లు నిర్మించుకొనేందుకు ఇచ్చిన రూ. 4 వేల కోట్ల అప్పులను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకొన్నామని చెప్పారు. ఇలా మొత్తం 30 లక్షల ఇండ్లపై రూ.4 వేల కోట్ల అప్పు ఉన్నదని, వాటిని పూర్తిగా మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. దీనివల్ల 30 లక్షల మంది పేదలు రుణవిముక్తులు అవుతారని వెల్లడించారు.
గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా 7.31 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించగా, అందులో మొదటిదశలో 50 శాతం పంపిణీ పూర్తయిందని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. మిగిలిన 50 శాతం మందికి వెంటనే పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. దీనికోసం రూ.4,463 కోట్ల నిధులు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకొన్నదని చెప్పారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఏప్రిల్లో ప్రారంభించి, ఆగస్టు నెలాఖరుకల్లా పూర్తిచేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు వివరించారు. గొర్రెల పంపిణీ కలెక్టర్ల నేతృత్వంలోనే నిర్వహించాలని, పారదర్శకంగా, వేగవంతంగా జరుగాలని నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో 4,00,903 ఎకరాల పోడుభూములకు సంబంధించి 1,55,393 మంది అడవి బిడ్డలకు పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి హరీశ్రావు చెప్పారు. ఈ పట్టాల పంపిణీ ఇక ముందు కూడా కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారుల గుర్తింపు, తీర్మానాలు పూర్తై పట్టాలు సిద్ధంగా ఉన్నవాటికి వెంటనే పంపిణీ చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు.
హైదరాబాద్లో చేపట్టిన దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణం దాదాపు పూర్తయిందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత బిడ్డలను హైదరాబాద్కు పిలిపించుకొని లక్షలాదిమంది మధ్య గొప్ప పండుగగా ఈ కార్యక్రమాన్ని జరుపాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకొన్నదని వెల్లడించారు. అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి దళితవర్గాలు హైదరాబాద్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని, అదేరోజు హైదరాబాద్లో పెద్ద సభను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవో- 58,59 కటాఫ్ డేట్ను పొడిగించాలని విజ్ఞప్తులు వచ్చాయని, దీంతో చివరిసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జీవో-58 కింద ఒక్క రూపాయి కూడా ఖర్చులేకుండా భూములపై హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పేదలపై జులుం ప్రదర్శిస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వారిని అక్కున చేర్చుకొంటూ ఉచితంగా పట్టాలు ఇస్తున్నదని చెప్పారు. జీవో-58 కింద ఇప్పటివరకూ 1,45,668 మందికి పట్టాలు ఇచ్చినట్టు తెలిపారు. జీవో-59 కింద ఇప్పటివరకూ 42 వేల మంది లబ్ధి పొందారని చెప్పారు. కటాఫ్ గడువును 2014 నుంచి 2020కి పొడిగించాలని నిర్ణయించిన నేపథ్యంలో దరఖాస్తులకు మరో నెలరోజులు గడువు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.
హిందువులు కాశీ, శబరిమల యాత్రకు భారీగా వెళ్తున్న నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల్లో వసతిగృహాలు నిర్మించాలని నిర్ణయించినట్టు మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి రూ.25 కోట్ల చొప్పున మొత్తం రూ.50 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. మంత్రుల బృందం, చీఫ్ సెక్రటరీని వీలైనంత తొందరగా కాశీకి పంపి అక్కడి అధికారులతో మాట్లాడి, వసతిగృహం నిర్మాణానికి చర్యలు తీసుకొనేలా ఆదేశాలు జారీచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రైవేటు స్థలం అయినా కొనుగోలు చేసి వసతి సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ శబరిమలకు వెళ్లి స్థల ఏర్పాట్లు చూడాలని, అన్నీ కుదిరితే వెంటనే పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించినట్టు చెప్పారు. గతంలో కేరళ ముఖ్యమంత్రితో సీఎం కేసీఆర్ మాట్లాడితే.. అక్కడ స్థలం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. దీంతో శబరిమలలో భవన నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకొన్నట్టు పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి కొంత సమయం ఉందని, పనులు జరుగుతున్నాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. త్వరలోనే సెక్రటేరియట్ ప్రారంభోత్సవ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. అమరవీరుల స్థూపం పనులు దాదాపు పూర్తికావొచ్చాయని, మంత్రి ప్రశాంత్రెడ్డి దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఇక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఆయన విగ్రహావిష్కరణను పండుగలా నిర్వహిస్తామని తెలిపారు. ఈ మూడు ప్రారంభోత్సవాలు నెల వ్యవధిలో ఉంటాయని వెల్లడించారు. వీటి ప్రారంభోత్సవ తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. అన్ని కార్యక్రమాలు జూన్ 2లోగా ముగిస్తామని వెల్లడించారు.
ఈ ఏడాది రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి హరీశ్రావు రైతులకు భరోసా ఇచ్చారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి వడ్ల కొనుగోలు ప్రారంభం అవుతుందని చెప్పారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి మే నెల వరకు సమయం ఉందని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ‘గృహలక్ష్మి పథకం’ ప్రారంభమైన నేపథ్యంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను నిలిపివేస్తామనే ఆలోచనే వద్దని, ఇదొక నిరంతర ప్రక్రియ అని స్పష్టంచేశారు. ఇండ్లులేని పేదల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టిస్తుందని వెల్లడించారు.