కరీంనగర్: జిల్లాలోని మానకొండూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని కరీంనగర్లోని దవాఖానకు తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
మృతులు కరీంనగర్లోని జ్యోతినగర్కు చెందిన కొప్పుల శ్రీనివాసరావు, బాలజీ శ్రీధర్, జలంధర్, శ్రీరాజ్గా, గాయపడిన వ్యక్తిని పెంచాల సుధాకర్ రావుగా గుర్తించారు. ఖమ్మం జిల్లాలోని కల్లూరులో దశ దినకర్మకు వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కొప్పుల శ్రీనివాసరావు సిరిసిల్లలో పంచాయతీరాజ్ ఈఈగా పనిచేస్తున్నారు.
మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి
ఈఈ శ్రీనివాస రావు మృతిపట్ల మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.