హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ పాలసీ సరెండర్ సాకుతో బీమా సొమ్మును కొట్టేసే ముఠా అరెస్టయింది. నకిలీ ఆధారాలతో ఆన్లైన్లో వాటిని ైక్లెయిమ్ చేసి 19 మంది నుంచి రూ.4 కోట్లు కొట్టేసింది ఈ ఘరానా గ్యాంగ్. దీర్ఘకాలంగా తమ పాలసీల గూర్చి పట్టించుకోని ఖాతాలను లక్ష్యంగా చేసుకొని దోచుకున్నది. కేసు వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ సోమవారం మీడియాకు వెల్లడించారు. సికింద్రాబాద్లోని ఇన్సూరెన్స్ బ్రాంచ్లో రిలేషన్ మేనేజర్గా పనిచేసే ఉద్యోగి, నిజామాబాద్ బోధన్కు చెందిన కొసరాజు రంగసాయి హర్ష ఇందులో కీలక సూత్రధారి. తన వద్దకు వచ్చే పాలసీదారుల జాబితాను పరిశీలించి చాలా రోజులుగా ఎలాంటి సంప్రదింపులు లేని పాలసీలు, గడువు ముగిసినా క్లెయిమ్ చేయని పాలసీలను ఎంపిక చేసుకుంటాడు. డాటాబేస్లోకి లాగిన్ అయి, ఆయా పాలసీదారుల ప్రొఫైల్లో తనకు సంబంధించిన ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీలను అప్డేట్ చేస్తాడు.
ఆన్లైన్లో సరెండర్ మెయిల్ను పరిశీలించి, అంతా ఒకే ఉండటంతో బ్యాంకు ఆ పాలసీ మెచూరిటీ డబ్బును బ్యాంకు ఖాతాలోకి పంపిస్తారు. గ్రాఫిక్ డిజైనర్ దుప్పలపాడి అక్షయ్కుమార్తో నకిలీ పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్లు తయారు చేయించి, వాటి ద్వారా యాసిన్ అహ్మద్, మాన్యం ప్రశాంత్లతో సౌత్ ఇండియా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపిస్తాడు. ఈఖాతాల వివరాలను సరెండర్ మెయిల్లో పంపించడంతో, ఇన్సూరెన్స్ కంపెనీ అందులోకి బదిలీ చేస్తుంది. విదేశాల్లో ఉండి, ఇటీవల వచ్చిన యాప్రాల్కు చెందిన బాధితుడు తన ఈమెయిల్ను మార్చుకోవడం కోసం బ్యాంకును సంప్రదించగా మీ పాలసీ పేరుపై రూ.75 లక్షలు కిశోర్కుమార్ పేరుపై బ్యాంకు ఖాతాకు జమ చేశామని చెప్పారు. దీనిపై బాధితుడు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠాను అరెస్ట్ చేశారు.