హైదరాబాద్/బన్సీలాల్పేట్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గత 24 గంటల్లో నాలుగు కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈమేరకు వైద్యారోగ్యశాఖ మంగళవారం ఓ బులెటిన్లో తెలిపింది. మొత్తం 402 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురికి పాజిటివ్గా తేలింది. 9 కేసులు యాక్టివ్గా ఉన్నట్టు వివరించింది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 వెలుగుచూసిన నేపథ్యంలో అన్ని రాష్ర్టాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా నాలుగు కేసులు వెలుగుచూశాయి. కరో నా కేసుల నేపథ్యంలో వైద్యాధికారులు సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో 50 పడకలతో కూడిన ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. క్యాజువాలిటీ వార్డు వెనకవైపున 50 పడకలతో ఐసోలేషన్ వార్డు, మెటర్నిటీ విభాగం సమీపంలో మహిళల కోసం ప్రత్యేకంగా 20 పడకలతో మరో ఐసొలేషన్ వార్డు ఏర్పాటు చేసినట్టు దవాఖాన సూపరింటెండెంట్ ఎం రాజారావు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరీ ముఖ్యంగా పదేండ్లలోపు చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాల సమస్యలతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని కోరింది. మాస్కు ధరించకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఫ్లూ లక్షణాలైన జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కుకారడం, శ్వాసలో ఇబ్బందులు వంటివి కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని కోరింది. ఉస్మానియా దవాఖాన, నల్లకుంట ఫీవర్ దవాఖాన, ఎర్రగడ్డ ఛాతీ దవాఖాన, నిలోఫర్లో ముందస్తు చర్యల్లో భాగంగా ఐసొలేషన్ వార్డులను అందుబాటులో ఉంచారు.