హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటివరకు 4 ఎకరాల వరకు ఉన్న 51.99 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద రూ.3,946 కోట్లు విడుదల చేశామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వానకాలం రైతుబంధు నిధుల విడుదలపై మంత్రి హరీశ్రావు సోమవారం నగరంలోని అరణ్యభవన్లో సమీక్షించారు. ఇప్పటికే మొత్తం 78,93,413 ఎకరాలకు సంబంధించిన నిధులు విడుదల చేశామని వెల్లడించారు. ఐదు ఎకరాల పైబడి ఉన్న రైతులకు ఈ నెల 5 నుంచి రైతుబంధు నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అర్హులైన ప్రతీ రైతుకు సకాలంలో నిధులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు.