హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా కుదేలైన వీధి వ్యాపారులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది వారికి చిన్న మొత్తాల్లో రుణాలు అందజేసింది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మించి రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల మందికి రూ.357 కోట్ల మేరకు రుణాలను అందజేశారు. రెండో దశలో రూ.400 కోట్లకుపైగా రుణాలు అందించనున్నారు. వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో దేశంలోని టాప్ 10 పట్టణాలు తెలంగాణకు చెందినవే ఉన్నాయి. రుణాలు పొందినవారిలో 66 శాతం మంది మహిళలే కావడం విశేషం. రాష్ట్రంలో 3.40 లక్షల మందికి రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 3.57 లక్షల మందికి లబ్ధి చేకూర్చారు. వీరికి మొదటి దశలో బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రూ.10వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు రూ.357 కోట్లు అందించారు. 40 లక్షలకు పైగా జనాభా ఉండి రుణాలు పొందిన వీధి వ్యాపారుల విభాగంలో హైదరాబాద్ అగ్రభాగాన నిలిచింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 69,646 దరఖాస్తులు రాగా 49,657 మందికి రుణాలు మంజూరు చేశారు. వీరిలో 45,694 మందికి డబ్బులు పంపిణీ చేశారు. వీరు వ్యాపారం చేసుకోవడానికి వెండింగ్ జోన్స్ను నిర్మిస్తున్నారు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి రెండో విడత అందించాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. రెండో విడతలో కనీసం రూ.400 కోట్లకు పైగా పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం మున్సిపల్ కమిషనర్లకు మార్గదర్శకాలు జారీచేశారు. రెండో విడతలో 7శాతం వడ్డీతో కనీసం రూ.15వేల రుణాన్ని, అవసరమైతే ఇంకా ఎక్కువ మొత్తాన్ని ఇవ్వనున్నారు. తీసుకున్న రుణాన్ని 18 నెలల్లో చెల్లించే వెసులుబాటు ఉంటుంది. 2022 మార్చి వరకు రెండో విడత రుణాలను పంపిణీ చేయనున్నారు. డిజిటల్ లావాదేవీలు జరిపితే దాదాపుగా వడ్డీ మొత్తం తిరిగి వచ్చే విధంగా మార్గదర్శకాలు ఖరారు చేశారు.
రాష్ట్రంలోని వీధి వ్యాపారులకు అందించిన రుణాల వివరాలు