హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఎంపిక చేసిన 3,300 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైబర్ అంబాసిడర్లుగా మారుతున్నారు. సైబర్ భద్రత, సైబర్ నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసే విధానం, తదితర అంశాలపై శిక్షణ తీసుకొంటున్నారు. 2021 జూన్లో ఆన్లైన్లో సైబర్ కాంగ్రెస్ పేరుతో అవగాహన తరగతులు ప్రారంభం కాగా, గ్రామీణ ప్రాంతాల్లోనూ సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు అక్కడి విద్యార్థులకు కూడా అధికారులు శిక్షణ ఇస్తున్నారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో రాష్ట్ర పోలీస్ మహిళా భద్రత విభాగం, రాష్ట్ర విద్యాశాఖ, సైబర్ క్రైం నిపుణులు, యంగిస్థాన్ అనే ఎన్జీవో కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి.
ఇంటర్నెట్లో ఏది మంచి? ఏది చెడు? దేన్ని ఎలా వినియోగించుకోవాలి? ఏయే అంశాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? ఎలాంటి పాస్వర్డ్లు వాడాలి? ఆన్లైన్ మోసాలు, ఆన్లైన్ వేధింపులు ఎదురైతే ఎలా రక్షణ పొందాలి? సమస్య పరిష్కారం.. తదితర అంశాలపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ కాంగ్రెస్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1,650 ప్రభుత్వ పాఠశాలల నుంచి ఇద్దరు చొప్పున విద్యార్థులను ఎంపిక చేశారు. అందులోనూ 8, 9 తరగతుల విద్యార్థులనే ఎంచుకొన్నారు. ఈ విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకొని, ఇతరులకు వాటిపై అవగాహన కల్పిస్తారు. ఫలితంగా సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడుతుంది. సైబర్ అంబాసిడర్లు నిత్యం పోలీస్, ఎన్జీవో ప్రతినిధులతో మాట్లాడటం, ఆ విషయాలను ఇతరులకు వివరించటం వంటి చర్యలతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతున్నాయని టీచర్లు చెప్తున్నారు. శిక్షణ పూర్తి కానున్నందున జూలై రెండో వారంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రాండ్ ఫినాలే నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత బ్యాచ్ కోసం మహిళా భద్రత విభాగం నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి.
విద్యార్థి దశలో అవగాహనే ఉత్తమం
టెక్నాలజీ పెరిగింది. ఇంటర్నెట్ లేకుండా రోజు గడవటం లేదు. అందుకు తగ్గట్టుగానే ఆన్లైన్ మోసాలు, ఇతర నేరాలు పెరుగుతున్నాయి. వీటి బారిన పడకుండా ప్రజల్ని కాపాడాలంటే అవగాహన కల్పించటమే ఉత్తమ మార్గం. ఈ అవగాహన విద్యార్థి దశ నుంచే ఉంటే బాగుంటుందని సైబర్ కాంగ్రెస్ను ప్రారంభించాం. ఇందులో సైబర్ అంబాసిడర్లుగా ఉండే విద్యార్థులు తోటివారితోపాటు తల్లిదండ్రులు, ఇతరులకు అవగాహన కల్పిస్తారు. మేం భావించినట్టే మంచి ఫలితాలు వస్తున్నాయి
– స్వాతిలక్రా, అడిషనల్ డీజీ, మహిళా భద్రత విభాగం ఇన్చార్జి
ఆన్లైన్ మోసాలపై పాటలు రాశా
ఫోన్ హ్యాకింగ్ గురించి నాకు మొదటిసారి శిక్షణలోనే తెలిసింది. మాకు సెషన్స్లో ట్రైనింగ్లో సేఫ్టీగా ఎలా ఉండాలి? లక్కీడ్రా కేసులు, అసంబద్ధ కాల్స్ గురించి నా దృష్టికి వస్తే పోలీసులకు తెలియజేస్తున్నా. సోషల్ మీడియా అకౌంట్లు సేఫ్గా ఉంచేందుకు ఎలాంటి పాస్వర్డ్లు పెట్టుకోవాలి? అపరిచితులతో ఆన్లైన్లో ఎలా ప్రవర్తించాలన్నదానిపై మా స్కూల్లో వారానికి ఒక క్లాస్ తీసుకొంటున్నా. నేను సొంతంగా సైబర్ నేరాలపై పాటలు, కవితలు కూడా రాశాను. నా పాటలు ఇప్పుడు యూట్యూబ్లో సైబర్ అంబాసిడర్ హాసిని పేరిట ఫేమస్ అయ్యాయి. కలెక్టర్ కావాలన్నదే నా లక్ష్యం.
– తంబళ్ల హాసిని, పదోతరగతి, జడ్పీహెచ్ఎస్, ఏన్కుర్, ఖమ్మం
మాది సామాజిక బాధ్యత
కరోనా తర్వాత ఆన్లైన్ వినియోగం పెరిగింది. ఆన్లైన్ మోసాలు, ఆన్లైన్లో మహిళలు, చిన్నారులపై వేధింపులు పెరిగాయి. వీటన్నింటినీ ఎదుర్కొనేలా సొసైటీలో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర పోలీసులతో కలిసి సైబర్ కా్రంగెస్లో భాగస్వాములం అవుతున్నాం. సైబర్ నిపుణులు చెప్పే అంశాలు పిల్లలు సరిగా నేర్చుకొనేలా చూడటం, వారిని సమన్వయం చేయటం మా విధి. మావంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నాం.
– అరుణ్ డేనియల్ ఎల్లమటి కుమార్, యంగిస్థాన్ ఫౌండేషన్, డైరెక్టర్