హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ):పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్టుగా వయసుకు మించి అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. నిత్యజీవితంలో ఎదురయ్యే పలు సమస్యలకు తమవైన పరిష్కారాలు చూపుతూ ఔరా అనిపిస్తున్నారు. టీచర్ల సహకారంతో వర్కింగ్ మోడళ్లను తయారుచేసి ‘ఇన్స్పైర్ -మానక్ జాతీయ ఎగ్జిబిషన్’కు ఎంపికయ్యారు. ఈ నెల 23 నుంచి 27 వరకు ఈ ఎగ్జిబిషన్ను వర్చువల్గా నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనకు రాష్ట్రం నుంచి 33 వర్కింగ్ మోడల్స్ ఎంపికయ్యాయి. వీరు తయారుచేసిన పరికరాలకు అందరికీ అందుబాటులో ఉండే వస్తువులనే వాడటం విశేషం. వాటిలో కొన్నింటి ప్రత్యేకతలు..
షాపింగ్ మాల్స్లో వెయిటింగ్ లేకుండా..
షాపింగ్మాల్స్లో భారీ క్యూలైన్లు, వెయిటింగ్లు వినియోగదారులకు చికాకు తెప్పిస్తాయి. దీనికి పరిష్కారంగా ‘ఎలక్ట్రానిక్ షాపింగ్ ట్రాలీ ఇన్ సూపర్మార్కెట్స్’ ప్రాజెక్ట్ను మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పుల్లూరు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల విద్యార్థి వై శివకృష్ణ రూపొందించాడు. గైడ్ టీచర్ ఏ మురళీకృష్ణ సూచనల మేరకు ఈ ట్రాలీని తయారుచేశాడు. మనకు కావాల్సిన వస్తువులను ట్రాలీలో వేయగానే ఆర్ఎఫ్ఐడీ రీడర్ గ్రహించి బిల్లింగ్ మొత్తాన్ని ఎల్సీడీ డిస్ప్లేలో ప్రదర్శిస్తుంది. వినియోగదారులు నేరుగా కౌంటర్ వద్దకెళ్లి ఆయా బిల్లు మొత్తాన్ని చెల్లించి ఎంచక్కా ఇంటికెళ్లవచ్చని శివకృష్ణ అంటున్నాడు.
గ్యాస్ అయిపోతుందని ఇట్టే చెప్పేస్తుంది
ఇంట్లో వంటగ్యాస్ సమస్యను తీర్చేందుకు ‘ఆటోమెటిక్ గ్యాస్ సిలిండర్ అలర్టింగ్ సిస్టం బేస్డ్ ఆన్ లోవెయిట్’ ప్రాజెక్ట్కు రూపకల్పన చేశాడు సిద్దిపేట జిల్లా కేశవాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థి జీ విజయ్. గైడ్ టీచర్ ఎండీ రాజ్మహ్మద్ ప్రోత్సాహంతో లోడ్ సెన్సార్, ఎల్సీడీ బోర్డులను మాత్రమే ఉపయోగించి గ్యాస్ సిలిండర్ బరువును ఎప్పటికప్పుడు తెలుసుకొనే ప్రాజెక్ట్ను రూపొందించారు. దీనితో గ్యాస్ వృథాను కూడా అరికట్టవచ్చని విజయ్ చెప్తున్నాడు.
విద్యుత్తు షాక్ నుంచి కాపాడేస్తుంది
పొలాల్లోకి జంతువులు రాకుండా ఏర్పాటుచేసే విద్యుత్తు కంచెలను గుర్తించే ‘లైఫ్ సేవింగ్ డివైజ్’ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థి కే మన్విత రూపొందించారు. పంటపొలాలకు వెళ్లినప్పుడు వెంట ఉన్న ఈ పరికరం విద్యుత్తు తీగలను గుర్తించి బీప్ శబ్దం చేస్తుంది. దాంతో ప్రమాదాలను నివారించవచ్చు.
‘మ్యూట్ పీపుల్ స్పీకింగ్ సిస్టం’
బధిరులకు నిత్యజీవితంలో ఉపయోగపడేలా ‘మ్యూట్ పీపుల్ స్పీకింగ్ సిస్టంను’ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాల జడ్పీహెచ్ఎస్ విద్యార్థి పయ్యావుల అక్షయ తయారుచేసింది. టీ, మంచినీళ్లు, ట్యాబ్లెట్లు, టిఫిన్, భోజనం ఏది కావాలన్నా ఈ పరికరంలో ముందుగానే రికార్డుచేసిన సందేశాలను వినిపిస్తే సరిపోతుంది.
‘అవైడ్ అన్వాంటెడ్ చిల్డ్రన్ డెత్ ఇన్ కార్’
కారు డోర్లు ప్రమాదవశాత్తూ లాక్పడి లోపల చిన్నారులు ఉంటే ప్రాణాపాయం ఏర్పడిన ఘటనలు అనేకం చూశాం. వీటికి పరిష్కారంగా ‘అవైడ్ అన్వాంటెడ్ చిల్డ్రన్ డెత్ ఇన్ కార్’ ప్రాజెక్ట్ను నిర్మల్ జిల్లా బోరేగావ్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థి ఎం నిఖిత తయారుచేసింది. పిల్లలు కార్లల్లో చిక్కుకుంటే ఈ పరికరం చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేస్తుంది.
‘సోల్జర్ హెల్త్ అండ్ పొజిషన్ ట్రాకింగ్ సిస్టం’
శత్రుదేశాల నుంచి సరిహద్దులను రక్షించే సైనికుల ఆరోగ్యాన్ని కాపాడే ‘సోల్జర్ హెల్త్ అండ్ పొజిషన్ ట్రాకింగ్ సిస్టంను’ మహబూబ్నగర్ జిల్లా నేరెళ్లపల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థి కే మున్నా తయారుచేశాడు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అనారోగ్యంపాలైన సైనికులను గుర్తించి వెంటనే చికిత్స అందించవచ్చని, అంతేకాకుండా గస్తీ సమయాల్లో తప్పిపోయినవారి ఆచూకీ కనుక్కోవచ్చని మున్నా చెప్తున్నాడు.
ఇవీ కూడా చదవండి…