Viral news : ‘నా తండ్రి చక్కెర (Sugar) ఎక్కువగా తింటున్నాడని, ఆయనకు చక్కెర తినవద్దని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పాలి’ అని ఓ ఇన్ఫ్లుయెన్సర్ రీల్ (Reel) చేశాడు. ఆ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో ప్రధాని దృష్టికి వెళ్లింది. అనూహ్యంగా ప్రధాని కూడా స్పందించారు. అంతేగాదు ఆ రీల్ను తన ఇన్స్టా ఖాతా (PM Ista Accout) లో షేర్ చేశారు. దాంతో ఆ రీల్ మరింత వైరల్గా మారింది.
యువరాజ్ దువా అనే కంటెంట్ క్రియేటర్ ఆ రీల్ చేశారు. ‘ప్రధాని మోదీకి నా తండ్రి చాలా పెద్ద అభిమాని’ అని దువా తెలిపారు. ‘ఈ దేశంలో కొడుకులు తమ తండ్రుల మీదున్న ప్రేమను వ్యక్తపర్చలేరని చాలామంది అంటుంటారు. కానీ ప్రేమ విషయంలో ఆ తండ్రులకు స్నేహితులు మూడో స్థానంలో, కుటుంబం రెండో స్థానంలో, మోదీజీ తొలి స్థానంలో ఉన్నప్పుడు కొడుకులు ఎలా ప్రేమను వ్యక్తపరుస్తారు..? మా నాన్న కూడా అంతే. ప్రధానికి చాలా పెద్ద అభిమాని. మోదీజీ చెప్పే మాటలను తూచా తప్పకుండా పాటిస్తారు. అందుకే ప్రధానికి నేను ఓ రిక్వెస్ట్ చేస్తున్నా. మోదీజీ చెబితే మా నాన్న చక్కెర వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకర జీవనశైలిని అలవాటు చేసుకుంటారని అనుకుంటున్నా’ అని తన రీల్లో కోరారు.
ఈ రీల్కు ప్రధాని మోదీ అనూహ్యంగా స్పందించారు. తన ఇన్స్టా స్టోరీస్లో ఆ రీల్ను షేర్ చేశారు. అంతేగాక ‘యువరాజ్ అభ్యర్థన మేరకు అతడి తండ్రిని, మిగతా అందరినీ కోరుతున్నా.. చక్కెర వినియోగం తగ్గించండి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి’ అని ప్రధాని పేర్కొన్నారు. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని, ఒబేసిటీ ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. తన రీల్ను మోదీ షేర్ చేయడంపై యువరాజ్ దువా ఆనందం వ్యక్తంచేశారు. తన వీడియో ప్రధానిదాకా వెళ్తుందని ఊహించలేదని, తనకు చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.