హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య రంగానికి అధిక ప్రాధా న్యం ఇస్తున్న ప్రభుత్వం.. దవాఖానలు, వైద్య కళాశాలల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగం గా చేపడుతున్నది. రాష్ట్రంలో నూతనంగా ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నది. వీటిల్లో సిబ్బంది నియామకానికి గతంలో 3,897 ఉద్యోగాలకు అనుమతి ఇవ్వ గా, కొత్తగా మరో 313 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ శనివారం ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో క్లినికల్, నాన్క్లినికల్ విభాగాల్లో 313 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందులో 45 గైనకాలజీ, 33 జనరల్ మెడిసిన్, 32 జనరల్ సర్జన్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.