హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 30 వేల విద్యాసంస్థలకు టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్లు కల్పించాలని మన ఊరు -మన బడి కార్యక్రమంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తే డిజిటల్ విద్య అందించడం సులభం అవుతుందని అభిప్రాయపడింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘ సమావేశం శనివారం జూబ్లీహిల్స్లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగింది. మంత్రులు కే తారకరామారావు, హరీశ్రావు, నిరంజన్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, దయాకర్రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మన ఊరు -మన బడి కార్యక్రమం పనులను సమీక్షించిన కమిటీ, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేపట్టి, విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేనాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచేందుకు జూన్ 1 నుంచి 12 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని క్యాబినెట్ సబ్కమిటీ నిర్ణయించింది. వేసవి సెలవుల అనంతరం జూన్ 13న బడులు తెరుచుకోనున్నాయి. అంతకు ముందే బడి బాటను నిర్వహించి, విద్యార్థులను పాఠశాలవైపు ఆకర్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. పాఠశాలల ఆధునీకరణ, ఇంగ్లిష్ మీడియం తదితర నూతన అంశాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి నమోదును పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా కారణంగా 2020-21, 2021 -22 విద్యాసంవత్సరాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించలేదు.
విద్యార్థి దశలోనే పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు నిధులను మంజూరు చేస్తున్నట్టు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలకు క్రీడా పరికరాల కొనుగోలు కోసం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.50 వేల చొప్పున మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సైతం ఇదే తరహాలో చేస్తే క్రీడలకు ఆదరణ పెరుగుతుందని సూచించారు. సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.
మన ఊరు-మన బడికి పరిశీలకులు మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు విద్యాశాఖ 17 మంది రాష్ట్రస్థాయి పరిశీలకులను నియమించింది. వీరికి కేటాయించిన జిల్లాల్లో ఈ నెల రెండు నుంచి 10వ తేదీ వరకు పర్యటించనున్నారు.