హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఒకేసారి 8 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించిన తెలంగాణ.. మరో ఘనత సాధించింది. 2022-23 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లలో దాదాపు 30% మన రా ష్ట్రం నుంచే కావ డం విశేషం. దేశంలో ఏటేటా ‘నీట్’ అభ్యర్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ పీజీ మెడికల్ సీట్లు చాలా మేరకు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గత మూడేండ్లలో దేశవ్యాప్తంగా ‘నీట్’కు హాజరైన విద్యార్థుల సంఖ్య, ఎంబీబీఎస్, పీజీ సీట్ల పెరుగుదల, ఖాళీల వివరాలను అందజేయాలని బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనికి తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇచ్చిన సమాధానాన్ని విశ్లేషించగా పలు ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి.
‘నీట్’కు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 2020లో 13.66 లక్షల మంది పరీక్ష రాయగా.. 2021లో 15.44 లక్షల మంది, 2022లో 17.64 లక్షల మంది ‘నీట్’కు హాజరయ్యారు.
ఏటా కనీసం లక్ష నుంచి లక్షన్నర మంది ‘నీట్’కు గైర్హాజరు అవుతున్నారు.
దేశవ్యాప్తంగా ఏటా ఎంబీబీఎస్ (యూజీ), పీజీ సీట్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 2021-22తో పోల్చితే ఈ ఏడాది 4,012 సీట్లు పెరిగాయి. ఇందులో 1,150 సీట్లు (దాదాపు 30 శాతం) తెలంగాణ నుంచే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించడం వల్లే ఇది సాధ్యమైంది.