EV Charging Points | హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ కేంద్రాలు, ఇతర మౌలికవసతులు పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ కృషిచేస్తోందని చైర్మన్ వై సతీష్ రెడ్డి చెప్పారు. మౌలికవసతుల కల్పనను మరింత వేగంగా పూర్తి చేసేందుకు.. ఎలక్ట్రిక్ వాహన రంగం, దాని అనుబంధ రంగాలకు చెందిన ప్రతినిధులతో బంజారాహిల్స్లోని అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో 2025 నాటికి 3 వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్లోనే ఎక్కువగా చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయన్నారు. అలా కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఓ రోడ్ మ్యాప్ తయారీలో భాగంగానే ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ మారుమూల ప్రాంతంలోనూ చార్జింగ్ వసతులు కల్పించే దిశగా ప్రయత్నాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లోనూఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ వసతి కల్పిస్తామన్నారు. గత ఏడాదిలో రాష్ట్రంలోనే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దాదాపు ఐదు రెట్లు పెరిగిందన్నారు.
జాతీయ రహాదారులు, రాష్ట్ర రహాదారులు, పట్టణాల్లోని ప్రధాన ప్రాంతాల్లో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు చేసి.. ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలపై ధీమా కల్పించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీనికోసం ఎలక్ట్రిక్ వాహన రంగంలోని సంస్థలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రెడ్కో స్వయంగా ఇప్పటికే 150 చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని సతీష్ రెడ్డి చెప్పారు. త్వరలోనే మరిన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. పబ్లిక్ ప్రైవేటు పార్ట్ నర్ షిప్ లో దేశంలోనే మొదటి చార్జింగ్ కేంద్రం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేశామన్నారు. ఆసక్తి ఉన్న వారు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం( PPPమోడల్)లో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అన్నీ కలిపి హైదరాబాద్ లో దాదాపు 500 చార్జింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. వీటి సంఖ్య త్వరలోనే మరింత పెరుగుతుందని తెలిపారు.
మౌలిక వసతులు పెంచేందుకు ఈ రంగానికి చెందిన ప్రతినిధులతో ఓ కమిటీ ఏర్పాటుకు రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ప్రతిపాదించారు. చార్జింగ్ కేంద్రాల ఏర్పాటులో ఎదురవుతున్న సవాళ్లు ఏంటీ..? వేగంగా పూర్తి చేయాలంటే ఏం చేయాలనే దానిపై సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులతో చైర్మన్ వై సతీష్ రెడ్డి ఇంటరాక్ట్ అయ్యారు. వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు సంస్థలు ముందుకొస్తే.. స్థలంతో పాటు, విద్యుత్ కనెక్షన్కు సంబంధించిన వ్యవహారాలు తాము చూసుకుంటామని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఎం కేసీఆర్, మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సహకారంతో ముందుకు వెళ్తున్నామన్నారు. దీనికి సంస్థలు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్కో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య, జీఎం ప్రసాద్, వాహన తయారీ సంస్థలు, వాహన డీలర్లు, చార్జింగ్ స్టేషన్ నిర్వహణ సంస్థలు, ఫ్లీట్ సర్వీస్ ఆపరేటర్లు పాల్గొన్నారు.