హైదరాబాద్, మే7 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకులాల్లో ప్రత్యేక కోటా కింద అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) విద్యార్థులకు 3 శాతం సీట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇదివరకే ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. అనుమతులు మంజూరయితే ఈ ఏడాది నుంచే దీనిని అమలు చేయాలని బీసీ సంక్షేమశాఖ యోచిస్తున్నది. ప్రస్తుతం రాత పరీక్ష ద్వారా బీసీ గురుకులాల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఎంబీసీల్లోని చాలా కులాలకు చెందినవారు ఇప్పటికీ సంచార జీవనం కొనసాగిస్తున్నారు. అదీగాక చాలా వెనుకబడి ఉన్నారు. రాత పరీక్షలో మిగతా కులాల విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎంబీసీ విద్యార్థులకు ప్రత్యేకంగా అడ్మిషన్ కల్పించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. అందుకోసం ఐదు సంవత్సరాలకు మాస్టర్ ప్లాన్ను రూపొందించింది. తొలుత ఎంబీసీల కోసమే ప్రత్యేకంగా రెండు, మూడుకు మించి హాస్టళ్లను ఏర్పాటు చేయాలనే దిశగా ఆలోచనలు చేసింది. దీంతో కొద్ది మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, అదేవిధంగా దూరాభారం అవుతుందని బీసీ సంక్షేమశాఖ భావించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ప్రత్యేకంగా హాస్టల్ను ఏర్పాటు చేయకుండా, అన్ని బీసీ గురుకులాల్లో ఎంబీసీ విద్యార్థులకు 3 శాతం కోటాను ఇవ్వాలని నిర్ణయించింది. అదీగాక రాత పరీక్షలో మెరిట్తో సంబంధం లేకుండా గురుకులాల్లో ప్రవేశం కల్పించాలని భావిస్తున్నది. గురుకులాల్లో చేరగోరే ఎంబీసీ విద్యార్థులు రాత పరీక్షకు దరఖాస్తు చేసుకుని ఉండాలని మాత్రం నిబంధన విధించింది. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వ ఆమోదానికి పంపింది.