కొత్తగూడెం క్రైం, జనవరి 20 : ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు, జవాన్లకు మధ్య శనివారం జరిగిన భీకరపోరులో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. పోలీస్ అధికారుల కథనం ప్రకారం.. బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని బెలంగుట్ట సమీపంలో మావోయిస్టు పార్టీ డీవీసీఎం వినోద్ కర్మ, ఆవాపల్లి ఎల్వోఎస్ రాజు పూనెం, ఏరియా కమిటీ సభ్యులు విశ్వనాథ్, గుడ్డు తేలం ఆధ్వర్యంలో సుమారు 25 మందితో సమావేశం జరుగుతున్నట్టు పోలీస్ అధికారులకు సమాచారం తెలిసింది. ఈ మేరకు డీఆర్జీ, కోబ్రా 210 బెటాలియన్ సంయుక్త ఆధ్వర్యంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో బెలం గుట్ట సమీపంలో ఉదయం 7:30 గంటల సయమంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య సుమారు 15 నిమిషాలపాటు భీకరపోరు జరిగింది. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే ఎత్తయిన గుట్టల మీదుగా దట్టమైన అటవీమార్గంలోకి పారిపోయారు. కాల్పుల విరమణ అనంతరం ఆ ప్రాంతాన్ని జవాన్లు తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చేపట్టగా.. ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు వారికి సంబంధించిన ఆయుధ, వస్తు సామగ్రి లభించింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి జవాన్కు గాయాలయ్యాయి. బీజాపూర్ జిల్లా చిన్నగేలుర్ క్యాంపు నుంచి ఎస్టీఎఫ్ జవాన్లు ఏరియా డామినేషన్కు బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులను టార్గెట్ చేస్తూ గుండెంతోయనాల్ వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై ప్రమోద్శర్మ అనే జవాను కాలు వేయడంతో అది పేలింది. ఈ ఘటనలో ప్రమోద్కు తీవ్రగాయాలయ్యాయి. తోటి జవాన్లు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఎయిర్లిఫ్ట్ ద్వారా రాయ్పూర్కు తరలించారు.