వనపర్తి: జిల్లాలోని కొత్తకోట మండలం ముమ్మాళ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ముమ్మాళ్లపల్లి వద్ద ముందు వెళ్తున్న చెరుకు ట్రాక్టర్ను మియాపూర్ డిపోకు చెందిన గరుడ బస్సు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వనపర్తి జిల్లా దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ ఆంజనేయులు, క్లీనర్ సందీప్ అక్కడికక్కడే మృతిచెందగా ప్రయాణికుడు శివన్న దవాఖానలో చికిత్స పొందుతుతూ ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై ముమ్మాళ్లపల్లి నుంచి అమడబాకుల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు, హైవే సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు.