హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): తమ పంట దిగుబడులను కొని నకిలీ చెక్కులిచ్చి మోసగించిన శ్రీలక్ష్మీకాంత స్పిన్నింగ్ మిల్ యాజమాన్యంపై, గుంటూరు మిర్చి వ్యాపారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లాకు చెందిన పత్తి, మిరప రైతులు డీజీపీ రవిగుప్తాను వేడుకున్నారు. సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి నేతృత్వంలో వారు శుక్రవారం డీజీపీకి వినతిపత్రం అందజేశారు. శ్రీలక్ష్మీకాంత స్పిన్నింగ్ మిల్ యజమానులైన సీ రామేశ్వర్రెడ్డి, సీ స్వామిరెడ్డి, సీ హిమబిందు తమను దారుణంగా మోసం చేశారని రైతులు తెలిపారు.
బకాయిలు చెల్లించాలని అడిగిన వారిని రామేశ్వర్రెడ్డి హింసించి చంపబోయాడని, అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. వారిపై కేసులు నమోదు చేస్తే మరింత మంది బాధిత రైతులు బయటకు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. వారి నుంచి రావాల్సిన రూ.3.77 కోట్లు ఇప్పించాలని, లేదంటే హైదరాబాద్లోని వారి ఇండ్ల ముందు సామూహిక ధర్నాకు అనుమతి ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేశారు. గుంటూరు మిర్చి వ్యాపారి ఎరువు జోసెఫ్రెడ్డి రైతులకు నకిలీ చెక్కులిచ్చి రూ.48.80 లక్షలకు మోసం చేశాడని, అతనిపై కూడా కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు పాసాని ప్రకాశ్రెడ్డి, చిన్నపురెడ్డి, రాజేశ్వర్రెడ్డి, సాంబిరెడ్డి, శ్రీపతి రాజకొమరయ్య తదితరులు పాల్గొన్నారు.