నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 14: ప్రాజెక్టులకు ఇన్ఫ్లోలు కొనసాగుతున్నాయి. బుధవారం జూరాల ప్రాజెక్టుకు 2.48 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 43 గేట్లు ఎత్తి దాదాపు అంతే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 3,51,456 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కావడంతో 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నా రు. ఇక్కడ 3.40 లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో న మోదైంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి 3,42,085 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. దాంతో ఎన్నెస్పీ అధికారులు సాగర్ ప్రాజెక్టు 16 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 2,36,080 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 588.70 అడుగులు (308.7708 టీఎంసీలు)గా ఉన్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు 13,357 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 13,348 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్కు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బుధవారం 9,02,550 క్యూసెక్కుల వరద రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరదను దిగువకు వదులుతున్నారు.