Telangana Voters | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో అత్యధికులు మహళలే ఉండటం విశేషం. ఈసీ జాబితా ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 3.26 కోట్లు. వీరిలో పురుషు సంఖ్య 1,62,98,418 కాగా, మహిళలు 1,63,01,705 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2,676 మంది, సర్వీసు ఓటర్లు 15,406, ఓవర్సీస్ ఓటర్లు 2,944 మంది ఉన్నారు.
18-19 ఏండ్ల వయసున్న 9,99,667 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. మృతి చెందిన, నకిలీ, చిరునామాలో లేని 9.48 లక్షల ఓట్లను ఈ ఏడాది తొలగించారు. 8.94 లక్షలమంది ఓటర్లు తమ వివరాలు, అడ్రస్లను సవరించుకున్నారు. తాజా ఓటరు జాబితా ప్రకారం రాష్ట్రంలో మహిళలు, పురుషుల నిష్పత్తి తొలిసారిగా పెరిగింది. ప్రతి వెయ్యిమంది పురుష ఓటర్లకు 1000.2 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 80 ఏండ్లు పైబడినవారు 4,40,371 మంది, దివ్యాంగ ఓటర్లు 5,06,921 మంది ఉన్నారు.