హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఈ నెల 29న దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులన్నీ సమాఖ్య రక్షణ దినోత్సవం(డిఫెండ్ ఫెడరలిజం డే)గా పాటించాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు. డిసెంబర్ 3,4 తేదీల్లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్ణయాలను సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాకు వివరించారు. దేశ సమాఖ్య నిర్మాణాన్ని కాపాడుకునేందుకు ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ పునాదులను దెబ్బతీసేందుకు ఆరెస్సెస్ నియంత్రిత బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ, కేరళ, తమిళనాడు తదితర రాష్ర్టాల్లో రాజ్భవన్లు బీజేపీ క్యాంపు కార్యాలయాలుగా పనిచేస్తున్నాయని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. భారత్కు జీ-20 అధ్యక్ష హోదా లభించడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని చెప్పారు. రొటేషన్ పద్ధతిలో లభించిన ఈ హోదాను ప్రధాని మోదీ తెచ్చినట్టుగా ఆరెస్సెస్, బీజేపీ ప్రచారం చేసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ మాట్లాడుతూ.. జీ-20 ఎజెండాలో మహిళా సాధికారత అంశం ఉన్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా సాధికారత బిల్లుకు ఆమోదం లభించేలా చూడాలని కోరారు.