హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): టీఎస్ బీ-పాస్ చట్టానికి విరుద్ధంగా ఇండ్ల నిర్మాణ అనుమతుల జారీలో జాప్యం చేసిన 29 మంది మున్సిపల్ అధికారులకు ప్రభుత్వం రూ.3 వేల చొప్పున జరిమానా విధించింది. వారిలో హనుమకొండ, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్నగర్, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి తదితర జిల్లాలకు చెందిన నలుగురు మున్సిపల్ కమిషనర్లు, 25 మంది సైట్ టెక్నికల్ వెరిఫికేషన్, సైట్ వెరిఫికేషన్ అధికారులు ఉన్నారు. ఈ అధికారుల వేతనాల నుంచి జరిమానా వసూలు చేయాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. టీఎస్ బీ-పాస్ చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. 2020లో ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం 90 మంది అధికారులకు జరిమానాలు విధించి, రూ.2.52 లక్షలు రికవరీ చేసింది.