నిజామాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పాలనలో సాగునీళ్లు తగ్గి, రైతులకు కన్నీళ్లు పెరిగాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తూనే కరువును తీసుకొచ్చిందని విమర్శించారు. కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అధ్యక్షతన నిర్వహించిన జహీరాబాద్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫేక్ వార్తలు, లీకు వార్తలతో ప్రజలను గందరగోళానికి గురిచేసే కుట్రలకు కాంగ్రెస్ పాల్పడుతున్నదని మండిపడ్డారు. నాలుగు నెలల పాలనలో రాష్ట్రంలో 280 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. వరి పంట కోతకు వచ్చినా ఇంకా రైతుబంధు పడలేదని తెలిపారు. బారాణా మందికి రైతుబంధును నిలిపేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. పంటలకు బోనస్ ఇచ్చాకే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానివ్వాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే సాయాన్ని ఆపి, కాంట్రాక్టర్లకు ఆర్థికశాఖ ద్వారా బిల్లులు దోచి పెడుతున్నదని విమర్శించారు. పంటలు ఎండిపోతున్నా, రాళ్లవానతో పంటలు నష్టపోతున్నా ఒక్క కాంగ్రెస్ మంత్రికి రైతులను పరామర్శించే తీరిక లేకపోవటంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మోసపూరిత కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్పై వ్యతిరేకత: పోచారం
దేవుడిలాంటి కేసీఆర్కు ఎందుకు ఓటు వేయకపోతిమి అని ప్రజలు బాధ పడుతున్నారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సాధారణంగా ప్రభుత్వం ఏర్పడ్డాక 3-4 ఏండ్లకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, కానీ కాంగ్రెస్ సర్కారుపై 4 నెలలకే వ్యతిరేకత వచ్చిందని వెల్లడించారు.
ప్రజల గొంతుకగా నిలుస్తా: గాలి అనిల్
జహీరాబాద్ ఎంపీగా రెండుసార్లు బీబీపాటిల్ గెలిచినా ఈ ప్రాంతాన్ని ఏనాడూ పట్టించుకోలేదని బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ విమర్శించారు. తాను ప్రజల గొంతు కగా నిలుస్తానని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
సమావేశం ప్రారంభంలోనే కరెంట్ కట్
నిజాంపేట, మార్చి 31: మెదక్ జిల్లా నిజాంపేటలోని ఫంక్షన్హాల్లో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హరీశ్రావు హాజరై స్టేజీపైకి వచ్చి మాట్లాడుతుండానే కరెంట్ పోయింది. దీంతో ఫంక్షన్హాల్ సిబ్బంది వెంటనే జనరేటర్ను ఆన్ చేయటంతో సమావేశం కొనసాగింది.
ఎండిన పంటల పరిశీలన
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాజీ మంత్రులు పోచారం శ్రీనివాస్రెడ్డి, హరీశ్రావు పర్యటించారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, గంప గోవర్ధన్, హన్మంత్షిండేతో కలిసి ఎండిన పంట పొలాలను పరిశీలించారు. రైతులు తమ కష్టాలు చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు.