హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముందుచూపుతో హరితహారం చేపట్టారని శాసనసభ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ (పీయూసీ) చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆరు విడతలుగా విజయవంతమైన హరితహారం ఏడోదశ కొనసాగుతున్నదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో 23 శాతమున్న అటవీ విస్తీర్ణం హరితహారంతో ప్రస్తుతం 28 శాతానికి పెరిగిందని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో హరితహారం, అడవుల విస్తీర్ణం తదితర అంశాలపై పీయూసీ సమావేశం జరిగింది. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జీవన్రెడ్డి మాట్లాడుతూ.. మొక్కలు పెంప కంతో సీఎం కేసీఆర్ అభినవ అశోకుడిగా మారాడని కొనియాడారు. 230 కోట్ల మొక్కలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 225 కోట్ల మొక్కలు నాటడం గొప్ప విషయమన్నారు.
మొక్క నాటడం సామాజిక బాధ్యత..
సీఎం కేసీఆర్ 1979లో సిద్దిపేట సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన పరిధిలోని నాలుగు గ్రామాల్లో పురుడు పోసుకున్న హరితహారం, 1985లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉద్యమంలా చేపట్టారని, సీఎం అయ్యాక హరితహారాన్ని ఏడేండ్లుగా కొనసాగిస్తున్నారని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ గుర్తుచేశారు. మొక్కలు నాటి సంరక్షించటం సామాజిక బాధ్యత అని ప్రజల్ని చైతన్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కలప స్మగ్లర్లకు పాలకులు తోడ్పాటును అందించారని, సీఎం కేసీఆర్ కఠినమైన చట్టాలు తేవటంతో వారి ఆగడాలకు అడ్డుకట్ట పడిందని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ తెలిపారు. మానవాళికి తల్లి తరువాత ప్రయోజనం కలిగించేది చెట్టని, చెట్లే ప్రగతికి మెట్లని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. ప్రజలు ఉద్యమస్ఫూర్తితో భాగస్వామ్యం కావటం వల్ల హరితహారం విజయవంతమైందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చెప్పారు. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీయూసీ చైర్మన్, సభ్యులు పిలుపునిచ్చారు.