హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘మనం వెళ్లాల్సిన రైలు జీవితకాలం ఆలస్యం’ అనే మాటను భారతీయ రైల్వే దశాబ్ధాల నుంచి నిజం చేసి చూపిస్తున్నది. ఆధునిక సాంకేతికత, ఆన్లైన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చినా ప్రపంచంలో అతిపెద్దదైన మన రైల్వే వ్యవస్థ ప్రయాణికులను సకాలంలో గమ్యస్థానానికి చేర్చడంలో ఇప్పటికీ ఘోరంగా విఫలమవుతున్నది. దేశంలోని మొత్తం ప్రయాణికుల రైళ్లలో నిత్యం సగటున 23.8% సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని, టైంటేబుల్ ప్రకారం గమ్యస్థానాలకు చేరడం లేదని స్వయంగా రైల్వేశాఖే అంగీకరించింది. 76.20% రైళ్లు సకాలంలో గమ్యస్థానాలకు చేరుతున్నట్టు చూపిస్తున్నప్పటికీ అవి మార్గమధ్యంలోని పలు స్టేషన్లకు ఆలస్యంగానే వస్తున్నాయి. ఇనగంటి రవికుమార్ అనే వ్యక్తి సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం ద్వారా సేకరించిన వివరాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రయాణికుల రైళ్లను ఆరు క్యాటగిరీలుగా విభజించి రాజధాని, దురంతో, శతాబ్ది, జనశతాబ్ది ఎక్స్ప్రెస్ (మెయిల్), ప్యాసింజర్ సర్వీసుల పేరుతో నడుపుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23 నాటికి ఇవన్నీ కలిపి మొత్తం 76,89,535 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్యాసింజర్ రైళ్ల సంఖ్య 59 లక్షలకు పైమాటే. ఈ మొత్తం ప్రయాణికుల రైళ్లలో 18,29,904 సర్వీసులు చాలా ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజధాని సర్వీసుల్లో 25.65%, దురంతో సర్వీసుల్లో 28.10%, శతాబ్ది సర్వీసుల్లో 12.45%, జనశతాబ్ది సర్వీసుల్లో 14.4%, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో 19.05% సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోవడం లేదని వివరించింది.