హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు 27 లక్షల దరఖాస్తులు అందాయి. 2023 రెండో విడత ఓటరు జాబితా సవరణ గడువు మంగళవారంతో ముగిసింది. కొత్తగా ఓటు హక్కు కోసం ఫారం 6 ద్వారా 13.06 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఓటు తొలగింపు కోసం ఫారం-7 ద్వారా 6.26 లక్షల మంది, ఓటరు చిరునామా మార్పు, సవరణల కోసం ఫారం -8 ద్వారా 7.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ వెల్లడించారు. వచ్చిన 27.09 లక్షల దరఖాస్తులు ఈ నెల 27వ తేదీలోగా పరిశీలించి అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. ఈ దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 3.13 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఇందులో పురుషులు 1.57 కోట్లు, మహిళలు 1.56 కోట్లు ఉం డగా, 2,226 థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్టుగా నిర్ధారించారు. 18, 19 సంవత్సరాలు వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 6.51 లక్షలకు చేరింది.
ఈవీఎం సిబ్బందికి శిక్షణ
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఈవీఎం నోడల్ అధికారులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో అదనపు ఎన్నికల ప్రధానాధికారి లోకేశ్కుమార్ వీరికి శిక్షణ ఇచ్చారు. ఈవీఎంలు, వీవీ పాట్ యంత్రాల నిర్వహణ, ఓటింగ్ సమయంలో, ఓటింగ్ పూర్తి అయిన తరువాత గురించి క్షుణ్ణంగా వివరించారు.