హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని మరోసారి చాటుకుంది. వ్యవసాయానికి అత్యంత కీలకమైన సాగునీటికి భారీగా నిధులు కేటాయించే పరంపరను కొనసాగించింది. ప్రతి ఏటా సాగునీటికి నిధుల కేటాయింపును పెంచుతున్న ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏకంగా రూ.26,886 కోట్లు కేటాయించింది. ఇది గత ఏడాది కేటాయింపుల కన్నా దాదాపు రూ.4,200 కోట్లు అధికం. 2022-23లో సాగునీటికి రూ.22,681 కోట్లు కేటాయించారు.
వాగుల పునరుజ్జీవ పథకం పేరిట రాష్ట్రవ్యాప్తంగా అన్ని వాగులపై రెండో విడతలో 585 చెక్డ్యామ్లను నిర్మించాలని నిర్ణయించారు. బడ్జెట్లో తొలిసారి కృష్ణా, గోదావరి బేసిన్లోని కల్వకుర్తి, నెట్టెంపాడుతో పాటు ఎల్లంపల్లి, మిడ్మానేర్, దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి భారీగా నిధులను కేటాయించారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల కుట్రల ఫలితంగా వట్టిపోయిన చెరువులను పునరుద్ధరించేందుకు మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టారు.
గొలుసుకట్టు చెరువులన్నింటినీ పునరుద్ధరించారు. ఆ తరువాత ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం మొదలుపెట్టారు. 2004-15 వరకు తెలంగాణ ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చు కేవలం 38,000 కోట్లు కాగా, తెలంగాణ ఏర్పాటు తరువాత గడచిన ఏడున్నరేండ్లలో రాష్ట్ర సర్కారు మేజర్, మైనర్, మీడియం ప్రాజెక్టులన్నింటిపైనా రూ.1.69 లక్షల కోట్లను వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటికి ఇస్తున్న ప్రాధాన్యం ఫలితంగా 2014-15 నాటికి ఉన్న 23.44 లక్షల ఎకరాల ఆయకట్టు నేడు ఏకంగా 73 లక్షలకు పైగా పెరిగింది.